నమ్మించి దోపిడీ  

10 Sep, 2020 12:35 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి, వెనుకవైపు నిందితులు

నిందితుల అరెస్టు 

ఒంగోలు: ‘పెద్ద మొత్తంలో మొక్కలు కావాలి.. మీరు వచ్చి స్థలం చూస్తే ఎన్ని మొక్కలు అవసరమవుతాయనే విషయం మాట్లాడుకుందాం’ అంటూ పూలమొక్కలు అమ్ముకునే వ్యాపారిని నమ్మకంగా పిలిపించి ఓ బృందం దోపిడీకి పాల్పడింది. ఈ సంఘటన గత నెల 29వ తేదీ స్థానిక కేశవరాజుకుంట ఫ్లైఓవర్‌ వద్ద చోటుచేసుకోగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఒంగోలు తాలూకా పోలీసులు బుధవారం నిందితులను అరెస్టు చేశారు.

ఒంగోలు రిక్షాబజార్‌లో నివాసం ఉంటున్న గుళ్లాపల్లి తిరుపతిని కేశవరాజుకుంట వద్దకు రప్పించిన దుండగులు.. అతని వద్ద ఉన్న వీవో మొబైల్, రూ.9 వేల నగదు, ఒక మోటారు బైకుతో అదృశ్యమయ్యారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న తాలూకా పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు చినగంజాం మండలం రాజుబంగారుపాలేనికి చెందిన జగన్నాథం నాగరాజు, అదే మండలం మన్నంవారిపాలేనికి చెందిన చలాకీ రాము, చలాకీ కళ్యాణ్‌గా గుర్తించారు. త్రోవగుంట ఎనీ్టఆర్‌ విగ్రహం వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం అందడంతో తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి సిబ్బందితో వెళ్లి దాడి చేసి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మోటారు బైకులు, ఒక సెల్‌ఫోన్, రూ.5 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు తోడ్పడిన ఐటీ కోర్‌టీం ఎస్సై నాయబ్‌రసూల్, కానిస్టేబుళ్లు మాలిక్, స్టేషన్‌ సిబ్బంది రామకృష్ణ, రవికుమార్, హనూక్‌లను సీఐ అభినందించారు.  

మరిన్ని వార్తలు