‘సైకో కిల్లర్’‌ ఎన్‌కౌంటర్‌!

4 Dec, 2020 08:30 IST|Sakshi

భోపాల్‌: కరుడుగట్టిన హంతకుడు దిలీప్‌ దేవాల్‌ హతమయ్యాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు. వివరాలు.. గుజరాత్‌లోని దాహోద్‌కు చెందిన దిలీప్‌కు హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇళ్లను టార్గెట్‌ చేసి తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనానికి పాల్పడేవాడు. సాక్ష్యాలు మాయం చేసే క్రమంలో ఇప్పటికే ఆరుగురిని చంపేశాడు. ఈ క్రమంలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో అతడిపై హత్యానేరం కింద కేసులు నమోదయ్యాయి.

కాగా గత నెల 25న దిలీప్‌ మధ్యప్రదేశ్‌లోని రాట్లాంలో చోరీకి పాల్పడ్డాడు. సెలూన్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి ఇటీవలే భూమి విక్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న దిలీప్‌ చోటీ దీవాళి రోజున తన గ్యాంగ్‌తో కలిసి వారింటికి వెళ్లాడు. బాధిత కుటుంబ సభ్యులు వీరిని అడ్డగించడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. వారి ఆర్తనాదాలు వినబడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ ఇరుపొరుగు వారి దృష్టి మరల్చాడు. ఈ ఘటనలో కుటుంబ యజమాని, అతడి భార్య, కూతురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. (చదవండి: భర్తను హత్య చేసిన భార్య)

గాలింపు చర్యలు చేపట్టి దిలీప్‌ గ్యాంగ్‌లోని అనురాగ్‌ మెహర్‌(25), గౌరల్‌ బిల్వాల్‌(22), లాలా భాబోర్‌(20)లను అరెస్టు చేశారు. దిలీప్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దిలీప్‌ హతంకాగా, ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ విషయం గురించి పోలీసులు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. దిలీప్‌ ‘సైకో కిల్లర్‌’ అని, దొంగతనాలు చేసిన తర్వాత బాధితులను హత్య చేసి రాక్షసానందం పొందేవాడని పేర్కొన్నారు. అతడి గ్యాంగ్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు