కారు బీభత్సం.. టైరు పగిలి.. మూడు బైకులను ఢీకొట్టి..

19 Dec, 2021 18:57 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై శ్రీనివాస్‌

సాక్షి,ధర్మారం(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. టైరు పగిలిపోయి.. అదుపు తప్పి, మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.  ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం రేవెళ్లి గ్రామానికి చెందిన పల్లపు శంకరయ్య–నాగమ్మ దంపతులు శనివారం ఉదయం రాయపట్నం వద్ద గల గోదావరిలో పుణ్యస్నానం చేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు మంచిర్యాల నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తోంది.

ధర్మారం చేరగానే కారు టైరు పగిలి, అదుపుతప్పి వారి వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం మరో రెండు బైకులను కొట్టేసి, ఆగిపోయింది. ఈ ఘటనలో శంకరయ్య కాలు విరిగింది. నాగమ్మ, ఇంకో బైక్‌పై ఉన్న ధర్మారం గ్రామానికి చెందిన ఒల్లెపు ఎల్లయ్య స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం శంకరయ్యను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: ఒకే కాలేజీ.. ఫేస్‌బుక్‌లో దగ్గరై సహజీవనం.. ఆ విషయం తెలిసి పవిత్ర నిలదీయగా..

మరిన్ని వార్తలు