చిచ్చు రేపిన ఇంటి స్థలం.. తల్లి, తమ్ముడి హత్య

29 Jun, 2021 08:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సూర్యాపేట జిల్లాలో విషాదం 

ఆత్మకూర్‌ (ఎస్‌): ఇంటి స్థల వివాదం ఓ కుటుంబంలో ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆగ్రహావేశంతో ఊగిపోయిన ఓ వ్యక్తి తల్లిని, సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కందగట్ల గ్రామం బుడిగె జంగాల కాలనీకి చెందిన తూర్పటి ఎర్ర కిష్టయ్య, మరియమ్మ (70) దంపతులకు ఐదుగురు సంతానం. ఆస్తుల పంపకాలన్నీ పూర్తయ్యాయి. చిన్న కుమారుడు శ్రీనుకు భార్య లేకపోవడంతో తల్లి వద్దనే ఉంటున్నాడు. సోదరులు లక్ష్మయ్య, శ్రీను (27)ల మధ్య తండ్రి ఇచ్చిన స్థలం విషయంలో కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది.

ఈ విషయమై సోమవారం రాత్రి చోటుచేసుకున్న చిన్నపాటి గొడవ.. ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన లక్ష్మయ్య.. తమ్ముడు శ్రీనుపై దాడి చేసేందుకు పందులను వేటాడే బల్లెంతో వెళ్లాడు. తల్లి మరియమ్మ అడ్డుపడేందుకు యత్నించగా.. ఆ బల్లెం తగిలి విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది. వెంటనే శ్రీనును కూడా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. 

చదవండి: స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి  

మరిన్ని వార్తలు