వివాహేతర సంబంధం: ఉరేసుకుని టీడీపీ నేత ఆత్మహత్య

17 Dec, 2022 07:50 IST|Sakshi

నల్గొండ: ఉరేసుకుని టీడీపీ నేత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భూదాన్‌పోచంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రాంచంద్రం(47)టీడీపీ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సెక్రటరీగా పనిచేస్తున్నాడడు. ఈయనకు భార్య రోహిణి, ఇద్దరు పిల్లలున్నారు. కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన భార్య రోహిణి కొండమల్లేపల్లిలో ఉద్యోగం చేస్తూ నల్లగొండలో ఉంటోంది. భర్త రాంచంద్రం మాత్రం పోచంపల్లిలో ఉంటున్నాడు. భార్య అపుడప్పుడూ ఇక్కడికి వచ్చిపోతుంటుంది. 

ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగిన బంధువుల వివాహానికి భార్యాభర్తలిద్దరూ హాజరయ్యారు. అనంతరం రాంచంద్రం పోచంపల్లికి రాగా, భార్య మాత్రం నల్లగొండకు పోయింది. శుక్రవారం మధ్యాహ్నం రోహిణి,  భర్త రాంచంద్రం మొబైల్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తడంలేదు. దాంతో ఆందోళన చెందిన ఆమె ఇంటికి పక్కన ఉంటున్న జెట్ట పద్మకు ఫోన్‌ చేసి తన భర్త ఫోన్‌ ఎత్తడంలేదు ఒకసారి ఇంటికి వెళ్లి చూడమని కోరింది. దాంతో ఆమె అక్కడి వెళ్లి చూడగా రాంచంద్రం ఇంట్లో చీరతో ఉరివేసుకొని వేలాడుతూ కన్పించాడు. భయపడిన పద్మ వెంటనే ఇరుగుపొరుగువారికి విషయం చెప్పింది.

అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు లోనికి వెళ్లి చూడగా రాంచంద్రం అప్పటికే మృతిచెందాడు. అనంతరం పోలీసులు పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పట్టణ కేంద్రానికి చెందిన ఓ మహిళ తన భర్తతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకొని డబ్బుల కోసం వేధించేదని రోహిణి ఆరోపించింది. ఆమె వేధింపులు భరించలేక మనస్తాపం చెంది  ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ బద్యానాయక్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు