వాట్సాప్‌లో తీవ్రవాద కార్యకలాపాలు 

23 Jan, 2021 22:07 IST|Sakshi

సాక్షి, చెన్నై ‌: వాట్సాప్‌ గ్రూప్‌లో తీవ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నించిన యువకుడిని ఎన్‌ఐఏ అధికారులు గురువారం అరెస్టు చేశారు. గత 2018 ఏప్రిల్‌లో తీవ్రవాద ముఠా తిరువారూరు జిల్లా, ముత్తుపేట్టైలో సమావేశం జరిపి చర్చించింది. ఆ తర్వాత కీళకరైలో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అప్పటి రామనాథపురం అడిషనల్‌ ఎస్పీ వెల్లదురై ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరిపారు. ఇందులో కీళకరై తూర్పువీధికి చెందిన మహ్మద్‌ ఫకీర్‌ కుమారుడు మహ్మద్‌ రియాజ్‌ (35)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసి సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.

మహ్మద్‌ రియాజ్‌ ఇచ్చిన సమాచారం మేరకు కడలూరు జిల్లాకు చెందిన సాధుల్లా కుమారుడు మహ్మద్‌ రషీద్‌ (25) వాట్సాప్‌ గ్రూప్‌లో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కుట్ర పథకాల గురించి ముఖ్య సమాచారాన్ని షేర్‌ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో అతని ఫేస్‌బుక్‌ అకౌంట్, ఈమెయిల్‌పై రహస్య పర్యవేక్షణ జరిపారు. ఇందులో తీవ్రవాద కార్యకలాపాలకు కుట్ర, దీనికి సంబంధించిన వివరాలను షేర్‌ చేసినట్లు తెలిసింది. దీంతో ఎన్‌ఐఏ అధికారులు అతన్ని అరెస్టు చేశారు.  

మరిన్ని వార్తలు