రెండు కుటుంబాలు మూడో కంటికి తెలియకుండా.. కిటికీలు తెరిచి చూస్తే...

3 Dec, 2021 07:54 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న బాధితులు, (ఇన్‌సెట్‌లో) పరారైన నిందితులు ఖాదర్‌బాషా, కామున్నీషా

కలికిరి(చిత్తూరు జిల్లా): అప్పుల మోత అధికమై రెండు కుటుంబాలు మూడో కంటికి తెలియకుండా ఇంటి సామాన్లను తీసుకుని పరారయ్యాయి. గురువారం రాత్రి కలికిరిలో ఇది వెలుగులోకి రావడంతో కలకలం రేపింది. బాధితుల కథనం...స్థానికంగా స్వీట్స్‌ దుకాణం నిర్వహిస్తున్న ఖాదర్‌ బాషా, ఏ వన్‌ సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులు కామున్నీషా, కరంతుల్లా పట్టణంలో పలువురి వద్ద అప్పులు చేశారు. గత శుక్రవారం నుంచి ఖాదర్‌ బాషా, దంపతులైన కామున్నీషా, కరంతుల్లా ఇళ్లకు తాళాలు వేసి ఉండటం, వారి మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అని వస్తుండడంతో రుణదాతలు అనుమానించారు.

చదవండి: కట్నం వేధింపులకు నవ వధువు బలి

గురువారం సాయంత్రం వారి ఇళ్ల కిటికీలు తెరచి చూశారు. ఇంట్లో వస్తువులేవీ పోవడంతో రెండు కుటుంబాల వారు పరారైనట్లు గుర్తించి కంగుతిన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు పరుగులు తీసి లబోదిబోమన్నారు. ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి దాదాపు 20 మంది బాధితుల నుంచి  వివరాలు నమోదు చేసుకున్నారు. రాత్రి వరకు అందిన ఫిర్యాదుల మేరకు నిందితులకు రూ.1.6కోట్ల అప్పులు ఉన్నట్లు తేలిందని చెప్పారు. కలికిరితో పాటు చింతపర్తి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారి నుంచి సుమారు రూ.3కోట్లకు పైగా నిందితులు అప్పులు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇదలా ఉంచితే, కలికిరిలో ఇటీవల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వరుసగా మోసాలు వెలుగు చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది.  

మరిన్ని వార్తలు