ఇద్దరు మహిళా మావోయిస్టుల అరెస్టు  

9 Sep, 2022 02:14 IST|Sakshi

కొత్తగూడెంటౌన్‌: పోలీసులు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా యాక్షన్‌ ప్లాన్‌తో వచ్చిన ఇద్దరు మహిళా మావోయిస్టులను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ వెల్లడించారు. అరెస్టు అయినవారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర నేత దామోదర్‌ భార్య, చర్ల ఏరియా కమిటీ మెంబర్‌ మడకం రజిత, దళసభ్యురాలు మడవి ధని ఉన్నట్లు తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ నెల 7న కుర్నపల్లి–బోదనెపల్లి మధ్య అటవీ ప్రాంతాల్లో చర్ల, స్పెషల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌ నిర్వహించగా వీరు పట్టుబడ్డారని తెలిపారు. రజిత స్వగ్రామం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం ములకనాపల్లి కాగా, ధనిది ఛత్తీస్‌గఢ్‌. మొత్తం 81 ఘటనల్లో తన ప్రమేయం ఉందని రజిత అంగీకరించినట్లు ఎస్పీ తెలి పారు.  కాగా, పోలీసులు చర్లలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మావోయిస్టులు చెబుతున్నారు. కానీ, ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించిన నేపథ్యాన మిగతా నలుగురి విషయమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది.   

మరిన్ని వార్తలు