బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు, కేసు నమోదు

3 Jul, 2021 16:46 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌పై అత్యాచారం కేసు నమోదైంది. బేగంపురా గ్రామానికి చెందిన పార్టీ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌పై ఐపీసీ సెక్షన్ 376, 504,506, సీఆర్పీసీ యాక్ట్ 156 (3)ల కింద కేసు నమోదు చేసినట్టు హరిద్వార్ సీనియర్ పోలీసు అధికారి అబుదాజ్ కృష్ణరాజ్ చెప్పారు. కొన్ని నెలల క్రితం సురేష్ రాథోడ్‌ అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయం గురించి బయటపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్టు ఆరోపించింది.

జ్వాలాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సురేష్ రాథోడ్‌ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. అంతేకాకుండా తన ప్రాణానికి ప్రమాదం ఉందని పేర్కొంటూ పోలీసులు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఆయన మీడియాతో మాట్లాడూతూ.. నా జీవితం ప్రమాదంలో ఉంది. నేను ఇంతకు ముందే చెప్పాను. కొంతమంది నాపై కుట్రలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో కేసు కూడా నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు బయట పెట్టాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. ఇంతకు ముందు కూడా ద్వారహత్ ఎమ్మెల్యే మహేష్ నేగి పై కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి.

మరిన్ని వార్తలు