కి‘లేడీ’: ఎస్సైలనే బ్లాక్‌మెయిల్‌ చేస్తూ..

10 Feb, 2021 19:30 IST|Sakshi

ఆరుగురు ఎస్సైలను బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేసిన నిందితురాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సైలను బ్లాక్‌మెయిల్‌ చేసి.. డబ్బులు వసూలు చేసిన కిలాడి లేడీ లతా రెడ్డిని బుధవారం రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్‌ చేసిన లతా రెడ్డి పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడించింది. పోలీసు అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేదాన్నని తెలిపింది. వివరాలు.. టైలర్‌గా పని చేస్తోన్న లతా రెడ్డి.. తరచుగా ఏదో ఒక సాకుతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఎస్సైలతో పరిచయం పెంచుకునేది. కొద్ది రోజుల పాటు వారితో చనువుగా మెలిగేది. 

ఆ తర్వాత సమయం చూసుకుని వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసేది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సదరు ఎస్సైల మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించేది. ఎస్సైలు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేసేది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఎస్సైలను బెదిరించి డబ్బు వసూలు చేసింది. 

అయితే నిందితురాలు ఇంతా జరిగినా ఒక్క ఎస్సై కూడా ఆమె మీద ఫిర్యాదు చేయకపోవడం విశేషం. చివరకు ఓ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వనస్థలిపురం పోలీసులు లతా రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

చదవండి: నిత్య పెళ్లికూతురు.. నలుగురికి టోపీ
                  ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా..

మరిన్ని వార్తలు