jharkhand: జార్ఖండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి!

14 Nov, 2023 09:45 IST|Sakshi

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక దుకాణంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు మహిళలతో పాటు నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. 

ఈ ఘటన ధన్‌బాద్‌లోని కెందువాడీహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెవార్ పట్టిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేవర్ పట్టిలోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ దుకాణంపైన ఒక ఇల్లు ఉంది. కొద్దిసేపటికే మంటలు ఆ ఇల్లంతా వ్యాపించాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆరుగురు ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు నిచ్చెన సాయంతో ఆ ఇంట్లోకి చేరుకుని, ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు. 

కాగా దుకాణంపైనున్న ఇంటిలో షాపు యజమాని సుభాష్ గుప్తా, అతని తల్లి తల్లి ఉమా దేవి, భార్య సుమన్ గుప్తా, నాలుగేళ్ల కుమార్తె మౌళి, ఏడాదిన్నర కుమారుడు శివాన్స్‌, సోదరి ప్రియాంక గుప్తా, సోదరుడు సుమిత్ ఉంటున్నారు. తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆసుపత్రిలో చేరిన సుభాష్ తల్లి, కూతురు, సోదరి చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమన్, సుమిత్, శివాన్స్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుభాష్, అతని తండ్రి అశోక్ ఇంట్లో లేరు. 
ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌ ఎన్నికల బరిలో వృద్ధనేతలు.. మాట తప్పిన పార్టీలు? 

మరిన్ని వార్తలు