Extra Marital Affair: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం: సెల్ఫీ వీడియోతో

9 Feb, 2022 19:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ప్రకాశం: భర్తతోపాటు అతను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు వేధిస్తున్నారంటూ ఓ వివాహిత ఉరేసుకుని అర్ధంతరంగా తనువు చాలించింది. మరణించే ముందు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమవుతూ తన ఆవేదనను వెలిబుచ్చింది. ఈ ఘటన మంగళవారం కంభం పట్టణంలోని కందులాపురం కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి సోదరుల కథనం మేరకు.. అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన దూదేకుల భాను(29)కు పదేళ్ల క్రితం కంభం పట్టణానికి చెందిన నాగూర్‌వలితో వివాహమైంది. వారికి ముగ్గురు కుమారులు.

అయితే నాగూర్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ వివాదం జరుగుతోంది. తరుచూ హింసిస్తుండటంతో భాను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా నాగూర్‌వలి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన భాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, తమ సోదరి చావుకు కారణమైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరులు కోరారు.   
చదవండి: వివాహేతర సంబంధం: భార్య తల నరికిన భర్త.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి..

మరిన్ని వార్తలు