కొండపైకి తీసుకెళ్లి భార్య గొంతుకోసిన భర్త

7 Apr, 2021 09:04 IST|Sakshi

భర్తే హతమార్చాడని అనుమానం

దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

సాక్షి, విజయనగరం : మండలంలోని కుమిలి కొండపై ఓ వివాహిత మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు నిర్థారించారు. భర్తే ఆమెను హతమార్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొండగుడ్డికి చెందిన సంబాపు పుష్ప(35)ను ఆమె భర్త సంబాపు శ్రీను ఈ నెల రెండో తేదీన కుమిలిలో రక్ష కట్టించుకుందామని చెప్పి మోపెడ్‌పై తీసుకెళ్లాడు. ఆ రోజు నుంచి ఆమె కనిపించలేదు. భార్యను తీసుకెళ్లిన శ్రీను కుమిలిలోనే విడిచిపెట్టి వెళ్లినట్లు బందువులకు చెప్పి చీపురుపల్లిలో పురుగుమందు సేవించి ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. అనుమానం వచ్చిన పుష్ప తల్లిదండ్రులు పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న తరుణంలో కుమిలి సమీపంలో కొండపై వివాహిత మృతదేహం వున్నట్లు మంగళవారం రాత్రి తెలుసుకున్నారు. 

ఆమె పుష్ప అని నిర్థారించుకుని భర్తే హత్య చేసి వుండవచ్చన్న అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలికి  మెరకముడిదాం మండలం సిమంద్రాయవలసకు చెందిన సంబాపు శ్రీనుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరి మధ్య ఎప్పటినుంచో మనస్పర్థలున్నాయి. రెండు నెలల క్రితమే సిమంద్రాయవలస నుంచి అత్తవారి గ్రామమైన కొండగుడ్డికి శ్రీను వచ్చినట్లు బంధువులు తెలియజేశారు. గతంలో కూడా భార్య భర్తలు పురుగుమందు సేవించినట్లు పోలీసులు తెలిపారు. భార్య సెల్‌ఫోన్‌లో తరచూ మాట్లాడుతున్నందునే వారి మధ్య గొడవలు జరుగుతుండేవని తెలిసింది. మృతురాలికి దీపిక, మనోజ్‌ అనే ఇద్దరు పిల్ల లు వున్నారు. భోగాపురం సీఐ సీహెచ్‌.శ్రీధర్, ఎస్‌ఐ ఆర్‌.జయంతి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: చేయి కోసుకొని.. లవర్‌కు వాట్స్‌ప్‌లో ఫొటోలు పెట్టి..

మరిన్ని వార్తలు