-

చేయని నేరానికి బలైపోతున్నా..

4 Jan, 2021 01:54 IST|Sakshi

వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టి యువకుడి ఆత్మహత్యాయత్నం

బంగారం పోయిన కేసులో విచారించిన పోలీసులు

సాక్షి, వరంగల్‌ (కమలాపూర్)‌: చేయని నేరానికి బలైపోతున్నానంటూ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం భీంపల్లిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. భీంపల్లికి చెందిన చింతల ప్రసాద్‌ తన వ్యవసాయ పనుల నిమిత్తం అదే గ్రామానికి చెందిన బొంకూరి కుమార్, అతని చిన్నాన్న కొడుకు రమేశ్‌ను తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో గత నెల 30న రాత్రి ప్రసాద్‌ తన ఇంటికి కుమార్‌తో పాటు రమేశ్‌ను తీసుకువెళ్లాడు. మరో యువకుడు పూర్ణచందర్‌తో కలిసి వీరంతా పార్టీ చేసుకుని రాత్రికి అక్కడే పడుకున్నారు. తెల్లవారాక ప్రసాద్‌తో కలిసి కుమార్, రమేశ్‌ పొలం వెళ్లారు.

అనంతరం పూర్ణ చందర్‌ను దించడానికి ప్రసాద్‌ వెళ్లి తిరిగి వచ్చేసరికి బీరువాలోని ఏడున్నర తులాల బంగారు నగలు కనిపించలేదు. కుమార్, రమేశ్‌ను అడగ్గా, తెలియదని చెప్పారు. దీంతో ప్రసాద్‌ జనవరి 1న కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమార్, రమేశ్‌ను పోలీసులు రెండు రోజులు విచారించి 2న సాయంత్రం వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే చేయని నేరానికి తాను బలైపోతున్నానంటూ కుమార్‌ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు 108 ద్వారా హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఎస్సై దేశిని విజయ్‌కుమార్‌ గౌడ్‌ను వివరణ కోరగా, ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు పిలిపించి స్టేట్‌మెంట్‌ తీసుకున్నామని, ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని చెప్పారు.  చదవండి: ('చావైనా.. బతుకైనా నీతోనే లావణ్య..’) 

మరిన్ని వార్తలు