Swiggy Delivery Boy: సినిమాను తలపించిన ఎటాక్ సీన్‌.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై వెంటపడి మరీ..

18 Sep, 2022 16:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చైతన్యపురి(హైదరాబాద్‌): మద్యం మత్తులో ముగ్గురు యువకులు స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి చేసి కొట్టిన ఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారంకిరణ్‌ అనే డెలివరీ బాయ్‌ శనివారం ఉదయం భవానీనగర్‌లోని వరలక్ష్మి టిఫిన్స్‌ వద్దకు ఆర్డర్‌ తీసుకునేందుకు వచ్చాడు. హోటల్‌లోకి వెళుతుండగా బయటకు వస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు కిరణ్‌కు తగిలాడు. దీంతో చూసి వెళ్లాలని చెప్పటంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు కిరణ్‌పై దాడికి దిగారు. తప్పించుకొని రోడ్డుపై పరుగెత్తుతుండగా వెంటపడి మరీ పిడిగుద్దులు, చెప్పులతో తీవ్రంగా కొట్టారు.
చదవండి: నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన..

అక్కడే ఉన్న స్విగ్గీ డిలివరీ బాయ్స్‌ కొందరు వారిని అడ్డుకొనేందుకు యత్నించగా, వారిపై కూడా దాడి చేశారు. స్విగ్గీబాయ్స్, స్థానికులు కొందరు వారి వెంటపడగా ముగ్గురూ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. వారిని వెంబడించిన కొందరు సరూర్‌నగర్‌లో పట్టుకుని ముందుగా సరూర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. ఘటన చైతన్యపురి పరిధిలో జరగడంతో వారిని అక్కడికి తరలించారు.

తీవ్రంగా గాయపడ్డ కిరణ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో కెనడా నుంచి ఇటీవలే వచ్చిన మలక్‌పేటకు చెందిన ఎన్‌ఆర్‌ఐ పి.ఆకాష్‌రాజ్‌ (26), సైదాబాద్‌కు చెందిన పి.శివ (22), ఎం.శివ (21)గా గుర్తించారు. కారులో ఓ యువతి కూడా ఉందని సమాచారం. నిందితులంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు