కట్టుకున్నవాడే కాలయముడు

13 Nov, 2023 13:25 IST|Sakshi
సాయిహరిత (ఫైల్‌)

చాగల్లు: అనుమానంతో కట్టుకున్న భార్యను భర్తే కడతేర్చిన విషాద ఘటన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఊనగట్లకు చెందిన దొంగా వెంకటేశ్వరరావుకు అదే గ్రామానికి చెందిన సాయిహరిత (28)తో 2016లో వివాహమైంది. వీరికి స్నేహ నాగహర్ష, బాలాదిత్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పొక్లెయిన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు కొంతకాలంగా కుటుంబంతో కలిసి తెలంగాణలోని ఖమ్మంలో నివాసం ఉంటున్నాడు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి సాయిహరిత ఈనెల ఒకటిన భీమవరం వచ్చింది.

అనంతరం స్వగ్రామమైన ఊనగట్లకు చేరుకుంది. ఆమె తల్లి ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉండడంతో అదే గ్రామంలో ఉన్న పెద్దమ్మ పిల్లి సత్యవతి ఇంట్లో ఉంటోంది. ఈనెల 5న తన పెద్దమ్మతో భర్త చంపేస్తానని బెదిరిస్తున్నాడని, తనకు భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సాయిహరిత తన అత్తయ్య దొంగా ఆదిలక్ష్మిని తీసుకుని పడుకునేందుకు పుట్టింటికి వచ్చింది. ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి వచ్చాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఆ సమయంలోనే సాయిహరితను గొంతు నులిమి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వరరావు కంగారుగా దుస్తులు వేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆదిలక్ష్మి అనుమానం వచ్చి గదిలో చూడగా కోడలు సాయిహరిత మృతి చెందినట్లు గుర్తించింది. మృతురాలి పెద్దమ్మ సత్యవతి ఫిర్యాదు మేరకు అనుమానస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీహెచ్‌ రమేష్‌ తెలిపారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు రూరల్‌ సీఐ రమణ పరిశీలించారు.

మరిన్ని వార్తలు