హాబీగా ఎంచుకున్న కళతో ఇప్పుడు రికార్డులు

25 Jan, 2021 00:49 IST|Sakshi

ఏడు అద్భుతాల రికార్డ్‌

తనను తాను అంకితం చేసుకున్నప్పుడే ఎంచుకున్న పని అయినా, అభిరుచి అయినా విజయవంతం అవుతుంది. కీర్తిని కట్టబెడుతుంది. అందుకు ఉదాహరణ 40 ఏళ్ల జిస్నా నాగిరిషా. ప్రపంచంలోని ఏడు అద్భుత కట్టడాల నమూనాలను గాజు బాటిళ్లపైన చిత్రించిన జిస్నా నాగిరిషాకు ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో ప్రవేశం లభించింది. జిస్నాకు పెయింటింగ్‌ అంటే చాలా మక్కువ. చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్‌ చేస్తూ ఉండేది. ఆరేళ్ల క్రితం బాటిల్‌ ఆర్ట్‌ నేర్చుకుంది. అలా చిత్రించిన బాటిల్‌ ఆర్ట్‌ను ఆప్తులకు కానుకలుగా ఇచ్చేది. కేరళ రాష్ట్రం కొచ్చిలో ఉంటున్న జిస్నా హాబీగా ఎంచుకున్న కళ ఇప్పుడు ఆమెకు రికార్డులు తెచ్చిపెడుతోంది.

‘ఆరేళ్లుగా బాటిల్‌ ఆర్ట్‌ చేస్తున్నాను. రెండేళ్ల క్రితం దీంట్లో ఏదో ప్రత్యేకత సాధించడమెలా అని ఆలోచించాను. అప్పుడే న్యూ సెవన్‌ వండర్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అనే ఆలోచన వచ్చింది’ అని ఈ సందర్భంగా అనందంగా చెబుతారు జిస్నా. ఆమె దీని గురించి మరింతగా వివరిస్తూ ‘స్మారక చిహ్నాల ఫొటోలను ఒక్కోటి పరిశీలిస్తూ చాలా ఆశ్చర్యపోయాను వాటి అందానికి. వాటిని యధాతథంగా సీసాలపై నిలపాలనుకున్నాను’ అని తన అభిరుచి గురించి తెలిపారు. అనుకున్నట్టుగానే రెండేళ్లలో ప్రపంచ అద్బుత కట్టడాలను బాటిళ్లపై చిత్రించి, ఇండియా ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించింది. జిస్నా బాటిల్‌ ఆర్ట్‌ గిఫ్ట్‌ ఐటమ్స్‌గానూ చేస్తుంది. డిజైన్‌ బట్టి ఒక్కో బాటిల్‌ గిఫ్ట్‌ ఐటమ్‌ రూ.1000 నుండి అమ్ముడవుతున్నాయి. ఏషియన్‌ రికార్డ్‌ నుంచి ప్రపంచ రికార్డ్‌ సాధించాలనే తపనలో ఉంది జిస్నా. 

మరిన్ని వార్తలు