అప్పట్లో జైలు..  త్వరలోనే విలాసవంతమైన హోటల్‌గా..!

3 Dec, 2023 10:40 IST|Sakshi

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సువిశాల భవంతి ఆరేళ్ల కిందటి వరకు జైలుగా ఉండేది. దీనిని 2017 మార్చిలో మూసివేశారు. ఇప్పుడు దీనిని పర్యాటకులకు బస కల్పించే హోటల్‌గా మారుస్తున్నారు. జపాన్‌లో హోన్షు దీవిలోని నారా నగరంలో ఉన్న ఈ జైలు బాల నేరస్థుల కారాగారంగా ఉండేది. దాదాపు 115 ఏళ్ల పాటు ఇది బాల నేరస్థుల కారాగారంగానే కొనసాగింది. ఖైదీలు బాగా తగ్గిపోవడంతో జపాన్‌ ప్రభుత్వం ఈ జైలును మూసివేసింది.

ప్రభుత్వం నుంచి దీనిని ఇటీవల హోషినో రిసార్ట్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. పర్యాటకులను ఆకట్టుకునేలా దీనిని హోటల్‌గా మార్చడానికి సన్నాహాలు ప్రారంభించింది. జైలు నిర్మాణాన్ని పెద్దగా మార్చకుండానే, ఇందులో పర్యాటకులకు ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించింది. అతిథులకు జైలులో బస చేసిన అనుభూతి కలిగించడానికి అనువుగా దీని మౌలిక నిర్మాణంలో మార్పులేవీ చేయడం లేదని, అదనంగా ఆధునిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని హోషినో రిసార్ట్స్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ అసాకో సాటో మీడియాకు చెప్పారు.

ఇందులో 48 మంది అతిథులు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని, హోటల్‌గా మారుస్తున్న జైలు ప్రాంగణంలోని గార్డ్స్‌ క్వార్టర్లు యథాతథంగా ఉంటాయని, వాటిలో గార్డులు ఎప్పటి మాదిరిగానే ఉంటారని తెలిపారు. ఈ ప్రాంగణంలో రెస్టారెంట్, మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిని 2026 నాటికి ప్రారంభించనున్నట్లు చెప్పారు. 

(చదవండి: పిల్లల గణతంత్ర ప్రపంచం!)

మరిన్ని వార్తలు