సరికొత్త ఔషధం..ఒక్క డోసు తీసుకుంటే చాలు.. దెబ్బకు కొలస్ట్రాల్‌ మాయం!

14 Nov, 2023 16:40 IST|Sakshi

మన శరీరంలో అవసరమైన కొలస్ట్రాల్‌ కంటే చెడు కొలస్ట్రాలే అధికంగా ఉంటుంది. దీని కారణంగానే అనారోగ్యం బారిన పడతాం. ముఖ్యంగా బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కూడా ఈ చెడు కొలస్ట్రాలే. అధిక బరవు సమస్యకు కూడా ఇది ఒక కారణమే. దీని గురించి ఇక బాధపడాల్సిన పని లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక డోసు ఈ సరికొత్త ఔషధం తీసుకుంటే ఏడాది వరకు నిశ్చింతగా ఉండొచ్చట. ఇంతకీ ఏంటా ఔషధం అంటే..

శాస్త్రవేత్తలు లెపోడిసిరాన్‌ అనే కొత్త ఔషధాన్ని కనుగొన్నారు. ఇది ఒక డోస్‌ ఇంజెక్షన్‌ రూపంలో తీసుకుంటే లిపోప్రోటీన్‌(ఏ) అనే చెడు కొలస్ట్రాల్‌ను దాదాపు ఒక ఏడాది పాటు గుర్తించలేనంతగా మాయం అయిపోతాయని చెబుతున్నారు. తద్వారా హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించొచ్చని అన్నారు. లిపో ప్రోటీన్‌(ఏ) లేదా ఎల్‌పీ(ఏ) అనే చెడు కొలస్ట్రాల్‌ శరీరంలోని ఇతర భాగాలకు రక్తప్రవాహాన్ని సాఫీగా జరగనివ్వదు.

అదీగాక ఈ అధిక ఎల్‌పీ(ఏ) స్థాయిలు వారసత్వంగా వస్తే మాత్రం.. వాటిని వ్యాయామం, ఆహారం లేదా మందుల ద్వారా కూడా ప్రభావింతం చేయలేం. అలాగే ఈ  అధిక ఎల్‌పీ(ఏ)కి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్సలు లేవు. ఈ సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా తాము కనుగొన్న ఈ కొత్త ఔషధం క్లినికల్‌ ట్రయల్స్‌లో చక్కటి ఫలితాలనిచ్చిందని చెప్పారు. ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు నెలలకొకసారి మాత్రమే తీసుకుంటే చాలు ఏడాది వరకు శరీరంలో ఎలాంటి చెడు కొలస్ట్రాల్‌ ఉండదు. పైగా అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.

ఈ కొలస్ట్రాల్‌ని ఉత్పత్తి చేసే కాలేయంలోని కణాలకు సంబంధించిన ఆర్‌నెన్‌ఏ మెసెంజర్‌ని నిలిపేస్తుంది. తత్ఫలితంగా చెడు కొలస్ట్రాలనేది శరరీంలో ఉండదని చెబుతున్నారు. అందుకోసం అసాధారణ స్థాయిలో ఎల్‌పీ(ఏ) ఉన్న 48 మందిపై పరిశోధనలు చేయగా..వారిలో కొందరికి ఈ కొత్త ఔషధం మోతాదులుగా వారిగా ఇచ్చారు. ఎక్కువ మోతాదుని ఇచ్చిన వారిలో త్వరిత గతిన కొలస్ట్రాల్‌ స్థాయిలు తగ్గి, రక్త పోటు స్థాయిలు సమంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే మోతాదు తక్కువగా ఇచ్చిన వారిలో చెడు కొలస్ట్రాల్‌ తగ్గడానికి, రక్తం స్థాయిల్లో మార్పులకు కనీసం మూడు రోజుల సమయం పట్టినట్లు తెలిపారు.

కానీ ఈ లెపోడిసిరాన్‌ ఔషధం మాత్రం క్లినిక్‌ పరిక్షల్లో నూటికి 94% సమర్థవంతంగా చెడు కొలస్ట్రాల్‌ని పూర్తి స్థాయిలో తగ్గించినట్లు తెలిపారు. అయితే ఈ పరిశోధనలో పాల్గొన్న వారందరికి ఎలాంటి ఇతర సమస్యలు లేవు. కానీ తాము నిర్వహించే సెకండ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో పక్షవాతం, గుండె జబ్బులు ఉన్న పేషెంట్లపై ఈ కొత్త ఔషధం ఎలా పనిచేస్తుందనేది నిర్థారణ అవ్వాల్సి ఉందన్నారు పరిశోధకులు. ఆ అధ్యయనంలో కూడా ఫలితాలు మంచిగా ఉంటే రోగులకు ఈ సరికొత్త ఔషధం గొప్ప సంజీవని అవుతుందన్నారు. అంతేగాదు దీన్ని ఏడాదికొకసారి టీకా మాదిరిగా తీసుకునేలా అభివృద్ధి చేస్తే.. ఈ చెడు కొలస్ట్రాల్‌ సంబంధిత వ్యాధుల బారినపడుకుండా ప్రజలను సురక్షితంగా ఉండగలుగుతారని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ మేరకు లిల్లీ రిసెర్చ్‌ ల్యాబరేటరీ అందుకు సంబంధించిన  పరిశోధన పత్రాలను అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కి సమర్పించింది.

(చదవండి: బీపీని కరెక్ట్‌గానే చెక్‌ చేస్తున్నారా? రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదా.?)

మరిన్ని వార్తలు