ఆమె మదర్‌ ఆఫ్‌ 'పిల్‌'! శక్తిమంతమైన మార్పుకి నిలువెత్తు నిదర్శనం!

11 Dec, 2023 13:37 IST|Sakshi

మనం తరుచుగా న్యాయవ్యవస్థలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్‌) గురించి వింటుంటాం. అసలు ఇది ఎలా వచ్చింది? దీన్ని ఎవరు తీసుకొచ్చారో తెలుసా?. ఈ పిల్‌ మన దేశ న్యాయవ్యస్థ గతినే మార్చేసింది. చెప్పాలంటే న్యాయవ్యవస్థలో ఓ మూలస్థంభంగా ఉంది. ఈ రెండు అక్షరాల 'పిల్‌' అనే పదం ఎంతోమందికి న్యాయం చేకూర్చడమే గాక, సమాజంలో గొప్ప మార్పుకి నాంది పలకింది. ఈ 'పిల్‌' ఓ మహిళ న్యాయవాది మహోన్నత కృషి. ఆమె క​థ ఎందరో యువ న్యాయవాదులకు స్ఫూర్తి. తన జీవితమంతా న్యాయం కోసం అర్పించిన ఆ స్ఫూర్తి ప్రదాత గాథ ఏంటంటే..

భారత న్యాయవాది పుష్ప కపిలా హింగోరాణిని 'మదర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌(పిఐఎల్‌)' లేదా 'ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం' తల్లిగా పిలుస్తారు. ఆమె 1927 నైరోబీలో జన్మించింది. విద్యాభ్యాసం అంతా కెన్యా, యూకేలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత 1947లో న్యాయవాద వృత్తిని అభ్యసించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆ క్రమంలోనే 1979లో బీహార్‌లోని అండర్‌ ట్రయల్‌ ఖైదీల దుస్థితి గురించి వచ్చిన వార్తపత్రక కథనాలను చూసి చలించిపోయింది.

ఈ చట్టాలన్నీ బాధితులు లేదా వారి బంధువులు మాత్రమే పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతిస్తున్నాయనే విషయం ఆమెకు తెలిసింది. దీని కారణంగా అభాగ్యులు, బలహీన వర్గాల ప్రజలు ఎలా చట్టపరమైన ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారనేది గమనించారు. ఈ అంతరాన్ని పరిష్కరించేలా బిహార్‌ జైళ్లలోని అమానవీయ పరిస్థితులను సవాలు చేస్తూ అండర్‌ ట్రయల్‌ ఖైదీల తరుపును హింగోరాణి తొలిసారిగా ఈ 'పిల్‌'ని దాఖలు చేశారు. ఇది హుస్సేనారా ఖాటూన్‌ కేసుగా భారతీయ న్యాయ చరిత్రలో ఓ మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆ 'పిల్‌' కాస్తా సామాజిక న్యాయం కోసం ఒక శక్తిమంతమైన సాధనంగా అవతరించింది. ఇది ఎందరో అభాగ్యులకు వరమై చట్టపరమైన పరిహారం పొందేలా చేసింది. క్రమంగా ఆ పిల్‌ న్యాయవ్యవస్థలో కీలక మూలస్థంభంగా మారిపోయింది. ఈ పిల్‌తోనే ఎన్నో సమస్యలను పరిష్కరించారు హింగోరాణి. 

ఈ 'పిల్‌'తో వాదించిన కేసులు

  • మహిళల హక్కులు: లింగ సమానత్వం కోసం పోరాడారు. అలాగే వరకట్నం వంటి వివక్షాపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు.
  • పర్యావరణ పరిరక్షణ: ఆమె కాలుష్యనికి కారణమయ్యే పరిశ్రమలను సవాలు చేస్తూ..సహజ వనరుల పరిరక్షణ కోసం వాదించింది.
  • జైలు సంస్కరణలు: ఆమె ఖైదీల హక్కులు,  జైలు పరిస్థితుల కోసం కూడా వాదించారు
  • శిశు సంక్షేమం: ఆమె బాలల రక్షణ కోసం పోరాడటమే గాక బాల కార్మిక పద్ధతులను సవాలు చేశారు.
  • సమాచార హక్కు: ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం వాదించారు.

తమ గోడును చెప్పుకోలేక,  న్యాయం పొందలేని బలహీన వర్గాల వారికి హింగోరాణి శక్తిమంతమైన గొంతుగా మారారు. ఆమె అవిశ్రాంతంగా న్యాయం కోసం నిబద్ధతగా నిలిబడి సాగించిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సంత్కరించి ప్రశంసించింది. హింగోరాణి కథ సమాజంలో తెచ్చే శక్తిమంతమైన మార్పుకి నిదర్శనం. అంతేగాదు న్యాయం కోసం ఎలా నిబద్ధతగా వ్యవహరించి పోరాడాలో అనేందుకు కూడా ఆమె ఒక ప్రేరణ.

(చదవండి: ఎవరీ సోమా మండల్‌? ఆమె వరల్డ్స్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఉమెన్‌గా..!


 

>
మరిన్ని వార్తలు