అమ్మంటే..అమ్మే: పోలీసమ్మ వైరల్‌ వీడియో 

24 Nov, 2023 19:12 IST|Sakshi

అమ్మ ఎక్కడున్నా అమ్మే. పసిబిడ్డ  గుక్క పట్టి ఏడిస్తే ఏ తల్లి మనసైనా తల్లడిల్లి పోదూ! అమ్మ ప్రేమ, మమకారం అలాంటిది మరి. తాజాగా సోషల్‌ మీడియాలో  ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

కేరళ కొచ్చిలోని ఈ ఘటన చోటు చేసుకుంది నాలుగు నెలల శిశువు ఏడుపు చూసి చలించిపోయారు కేరళ పోలీసు అధికారి  ఎంఏ ఆర్య.  క్షణం ఆలోచించకుండా  ఆకలితో ఉన్న పాపాయికి తన స్థన్యం ఇచ్చి బిడ్డను అక్కున చేర్చుకున్నారు.   నెటిజనుల హృదయాలను గెలుచుకున్నారు.

పాట్నాకు చెందిన బిడ్డ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. కొచ్చిలోని ఎర్నాకులం జనరల్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతోంది. బిడ్డ తండ్రి వలస కార్మికుడు ఇక్కడ జైలులో ఉన్నాడు. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు.అయితే అనారోగ్య సమస్య కారణంగా  ఆసుపత్రిలో చేరిన తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారని కంట్రోల్ రూమ్  పోలీసుల సమాచారం అందించారు సిబ్బంది. వారిని చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో, సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది.   వెంటనే స్పందించిన పోలీసులు వారిని గురువారం కొచ్చి సిటీ మహిళా స్టేషన్‌కు తీసుకువచ్చారు.

ఇంతలో తల్లి దూరమైన ఆ చిన్నారి ఆకలితో ఏడుస్తోంది. అది చూసి ఫీడింగ్ మదర్ కూడా అయిన పోలీసమ్మ తన  తల్లి మనసు చాటుకున్నారు.  ఆ చిన్నారికి పాలివ్వడానికి సిద్ధంగా ఉన్నానని అధికారిని ఒప్పించి  శిశువు కడుపు నింపి నిద్రపుచ్చారు.  తనకూ తొమ్మిది నెలల పసి బిడ్డ ఉందని బిడ్డ ఆకలి  తనకు  తెలుసునని చెప్పింది. ఆర్య చేసిన పనిని నగర పోలీసులు ప్రశంసించారు. అలాగే  అనారోగ్యంతో ఉన్న మహిళ  పిల్లలను చైల్డ్ కేర్ హోమ్‌కు తరలించామని పోలిసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు