కొత్త విశ్వ వ్యవస్థకు ఆశాదీపం

8 Sep, 2023 00:20 IST|Sakshi

సందర్భం

భారతదేశం సహజంగానే తన డీఎన్‌ఏలో ప్రతిభా భాండాగారాన్ని కలిగి ఉంది. ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞుల అద్భుతమైన కృషి ఆధునిక పరిశోధనలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశ పురోగమనం, ఎదుగుదల కేవలం దాని సొంత ప్రజల కోసమే కాకుండా, మనం ‘ప్రపంచ కల్యాణం’ అని దేన్నయితే  పిలుస్తామో అటువంటి  ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడాలి. భారతదేశ అధ్యక్షతన జి–20 ఇతివృత్తం అయిన ‘ఒక భూమి – ఒక కుటుంబం – ఒక భవిష్యత్తు’, మన ప్రాచీన విలువ ‘వసుధైవ కుటుంబం’తో ముడిపడి ఉంది.

జ్ఞాన నాగరికతగా, భారతదేశం సహజంగానే తన డీఎన్‌ఏలో ప్రతిభ భాండాగారాన్ని కలిగి ఉంది. భారతదేశ చరిత్ర చూస్తే– గణితం, ఖగోళ శాస్త్రం,వైద్యం, తత్వశాస్త్రం, సాహిత్యంతో సహా వివిధ విజ్ఞాన రంగాల్లో గణనీయమైన కృషి చేసిన ప్రస్థానమే గోచరిస్తుంది. ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుల సంఖ్యా సిద్ధాంతం, గణిత విశ్లేషణలో అద్భుతమైన కృషి ఆధునిక పరిశోధనలను కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. జ్ఞాన నాగరికతగా భారతదేశ చరిత్ర దాని సమకాలీన విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఇది ప్రపంచ శ్రేయస్సుకు గణనీయమైన సహకారిగా నిలిచింది.

విశ్వ శ్రేయస్సుకు జి–20
జి–20 అధ్యక్షతలో భారతదేశం మొత్తం వర్కింగ్‌ గ్రూపులు లేదా మంత్రుల సమావేశాలలో జరిగిన అన్ని చర్చలను కూడా గొప్ప ప్రపంచ శ్రేయస్సు అనే బంధంతో అనుసంధానం చేసింది. ‘‘ఒక భూమి – ఒక కుటుంబం – ఒక భవిష్యత్తు’’ అనే జి–20 ఇతివృత్తం, మన ప్రాచీన విలువలైన ‘వసుధైవ కుటుంబం’తో ముడిపడి ఉంది. భారతదేశ పురోగమనం, ఎదుగుదల కేవలం దాని సొంత ప్రజల కోసమే కాకుండా, మనం ‘ప్రపంచ కల్యాణం’ అని దేన్నయితే  పిలు స్తామో అటువంటి ప్రపంచ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగ పడాలి.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దాని సహజసిద్ధమైన బలం, సామర్థ్యాలను ప్రపంచం స్పష్టంగా విశ్లేషించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ‘ప్రకాశవంతమైన ప్రదేశం’గా గుర్తించింది. భారతదేశ స్థూల ఆర్థిక మూలాధారాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పవనాలు ఎదురవుతున్నప్పటికే , భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశం ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అతి తక్కువ సమయంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోంది.
 
ఆదర్శాలతో కూడిన విద్య 
విజ్ఞానం, నైపుణ్యం ద్వారా మానవ మూలధనాన్ని పెంచడం అనేది భారతదేశ సామర్థ్యానికి కీలకం. విద్య అనేది వృద్ధి, ప్రేరణలను నడిపించే, నిలబెట్టే ‘మదర్‌–షిప్‌’(కేంద్రం). విద్య అనేది పౌరులను శక్తిమంతం చేసే మాతృశక్తి. దానికి అనుగుణంగా రూపొందించిన నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) అన్నింటికీ మూల పత్రం. సమగ్ర జాతీయ విద్యా విధానం–2020, భారత్‌లో విద్యను సమగ్రంగా, భవిష్యత్తు మార్గదర్శకంగా, ప్రగతి శీలంగా ఒక ముందు చూపు ఉండేలా సంపూర్ణంగా రూపొందించడం జరిగింది. 

బలమైన విషయ అవగాహన, స్పష్టతను నిర్ధారించడం కోసం మాతృభాషలో నేర్చుకోవడానికి నూతన విద్యా విధానంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే మాతృభాషలో విద్య అనుసంధాన భాషలను భర్తీ చేయదు, కానీ వాటికి అనుబంధంగా ఉంటుంది. ఇది జ్ఞానపరంగా తక్కువ సమస్యలను అధిగమించే విద్యార్థులతోపాటు సజావుగా చదువుకొనే విద్యార్థులకు కూడా చక్కటి విద్యా మార్గాలను అందిస్తుంది. 

ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ ఇప్పుడు ప్రాధాన్యతను సంత రించుకుంది. ఎన్‌ఈపీ–2020, భారతదేశాన్ని అత్యుత్తమ అధ్యయన గమ్యస్థానంగా మార్చడానికిగానూ, అధ్యాపకులు/ విద్యార్థుల మార్పిడి, పరిశోధన, బోధనా భాగస్వామ్యాలు, విదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన ఎంఓయూలపై సంతకాలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఐఐటీ– మద్రాస్, ఐఐటీ– ఢిల్లీ ఇప్పటికే తమ విదేశీ క్యాంపస్‌లను వరుసగా జాంజిబార్‌–టాంజానియా, అబుదాబి– యూఏఈలలో ఏర్పాటు చేయడానికి అవగాహనా ఒప్పందాలను కుదర్చుకున్నాయి.

విదేశాలతో విద్యా భాగస్వామ్యం
పరిశోధనను ప్రోత్సహించడానికి పరిశ్రమ–అకాడెమియా సహ కారం అనేది ఎన్‌ఈపీలో చేర్చిన మరొక ప్రాధాన్యత అంశం. అకడమిక్‌ ఇన్ స్టిట్యూషన్ ్సలో తొలి అడుగు నుండి పరిశోధనల వరకు సులభతరం చేయడానికి నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు అవుతోంది. భారతదేశాన్ని పరిశోధన–అభివృద్ధి హబ్‌గా మార్చ
డంపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. సులభతర వ్యాపారం మాత్రమే కాకుండా సులభతర పరిశోధన కూడా ఉండేలా ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

అంతేకాకుండా, ప్రధాన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యూరప్‌ దేశాలతో భారతదేశం విద్యా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ భారతదేశ ప్రతిభను గుర్తించి, దృష్టిలో ఉంచుకుంటారు. ఇనిషియేటివ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ (ఐసెట్‌), క్వాడ్‌ ఫెలోషిప్‌ కింద హై–టెక్నాలజీ రంగాలలో మెరుగైన సహకారాన్ని ప్రోత్సహించడం జరగుతుంది.

భారతీయ విద్యను ప్రపంచ విద్యతో సమలేఖనం చేయడంలో ప్రామాణీకరణ సహాయ పడుతుంది. జాతీయ విద్యా విదానం కింద, పాఠశాల విద్య కోసం నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ విడుదల చేయడమైనది. ఇది నిర్దిష్ట అభ్యాస ప్రమాణాలు, కంటెంట్, బోధనాశాస్త్రం, మూల్యాంకనాలకు ప్రమాణాలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా, విభిన్న విద్యావేత్తల అభ్యాసాన్ని అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ పరిధిలోకి తీసుకు రావడానికి నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ పనిచేస్తుంది.

గొప్ప శ్రామిక శక్తి
భారతదేశంలో ఇప్పుడు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల 60 కోట్ల జనాభా ఉంది. 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు. బహుళ–క్రమశిక్షణ, బహుళ–నైపుణ్యం కలిగిన, విమర్శనాత్మకంగా ఆలోచించే, యువకులు, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామికశక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. 

భారతదేశం ఇప్పుడు మూడవ అతిపెద్ద స్టార్ట్‌–అప్‌ పర్యావరణ వ్యవస్థ. 100 కంటే ఎక్కువ యునికార్న్‌లతో నైపుణ్యం, వ్యవస్థాపక తకు ప్రతీకగా నిలిచింది. మెట్రో నగరాల్లో మాత్రమే కాదు, భారతదేశ ఆవిష్కరణలు, స్టార్టప్‌లు టైర్‌ 2, టైర్‌ 3 నగరాలు, పట్టణాల ద్వారా కూడా ఆవిష్కారం అవుతున్నాయి. 

6వ తరగతి నుండి పాఠశాల విద్యలో నైపుణ్యం ఏకీకృతం అయింది. సాంకేతికతతో నడిచే పారిశ్రామిక వాతావరణంలో నిల దొక్కుకోవడానికిగానూ పాఠశాల స్థాయి నుండే నైపుణ్యం కలిగిన మానవ శక్తిని రూపొందించడానికి సింగపూర్‌ స్కిల్‌ ఫ్రేమ్‌వర్క్‌ అనుసరించదగినది.

అభివృద్ధి చెందుతున్న కొత్త క్రమంలో మానవ మూలవనరుల ప్రధాన పాత్రను భారతదేశం గుర్తించింది. విద్య, నైపుణ్యంతో కూడిన వ్యక్తులు నేటి జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మాత్రమే విజ్ఞాన సరిహద్దును విస్తరించడం, ఆర్థిక వృద్ధికి ఊత మివ్వడంతో పాటు, అద్భుతమైన ఆవిష్కరణలు అందించగలరు; శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా దేశ నిర్మాణానికి అసాధారణమైన సహకారాన్ని అందించగలరు.

ప్రపంచ ప్రయోజనాల కోసం ఇప్పుడు భారత దేశం ఒక పెద్ద ప్రయోగశాల. జ్ఞాన శతాబ్దం అయిన 21వ శతాబ్దంలో కొత్త సాంకేతి కతలు కొత్త క్రమానికి నాంది పలుకుతాయి. భారతదేశం తన విస్తారమైన నైపుణ్య గనిని ఏర్పరచడంలో, కొత్త క్రమాన్ని రూపొందించడంలో ముందంజలో ఉంది.

ధర్మేంద్ర ప్రధాన్‌
వ్యాసకర్త కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపకత మంత్రి 

మరిన్ని వార్తలు