ఒపెన్‌హైమర్‌తో మన అనుబంధం

4 Aug, 2023 03:41 IST|Sakshi
రాబర్ట్‌ ఒపెన్‌హైమర్‌ 

విశ్లేషణ

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు జారవిడిచి 78 ఏళ్లు అవుతోంది. ఆధునిక యుగంలో ఇంతటి విధ్వంసకరమైన ఘటన మరోటి చోటుచేసుకోలేదంటే అతిశయోక్తి కాదు. రెండో ప్రపంచయుద్ధం నాటి ఈ ఘటనపై లెక్కలేనన్ని పుస్తకాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. తాజాగా ప్రదర్శితమవుతున్న ‘ఒపెన్‌ హైమర్‌’ చిత్రం కూడా ఈ కోవకు చెందినదే.

మన్‌హాటన్‌  ప్రాజెక్టులో భాగంగా తయారైన అణుబాంబులు, వాటి సృష్టికర్త జె.రాబర్ట్‌ ఒపెన్‌ హైమర్‌ ఇతివృత్తంతో సాగుతుంది ఈ సినిమా. ఒపెన్‌హైమర్‌కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది.

జర్మనీలో పుట్టి అమెరికాలో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగిన ఒపెన్‌ హైమర్‌ను అణుబాంబు పితామహుడని కూడా అంటారు. ఒపెన్‌హైమర్‌కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆయనకు ఉందని చెబుతున్న ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. దీన్ని 20వ శతాబ్దంలో ఆధునిక భౌతిక శాస్త్రం అభివృద్ధి నేపథ్యంలో చూడాలి. 

విశ్వం మొత్తానికి ఆధారమైన, మౌలికమైన కణాలపై అధ్య యనం సాగిన కాలం అది. అణు కేంద్రకం దాంట్లోని భాగాలను అర్థం చేసుకునే అణు భౌతికశాస్త్ర అభివృద్ధి కూడా ఈ కాలంలోనే వేగం పుంజుకుంది. అణుశక్తితోపాటు అణుబాంబుల తయారీకి దారితీసిన పరిశోధనలివి. ఈ కాలపు భారతీయ శాస్త్రవేత్తలు కూడా చాలామంది ఈ అణు భౌతిక శాస్త్ర రంగంలో కృషి చేశారు.

దేబేంద్ర మోహన్‌ బోస్‌ (ఇతడి విద్యార్థిని బిభా చౌధురి), మేఘనాథ్‌ సాహా, సత్యేంద్రనాథ్‌ బోస్, హోమీ జహంగీర్‌భాభా, దౌలత్‌సింగ్‌ కొఠారీ, పియారా సింగ్‌ గిల్‌ వంటి మహామహులు వారిలో కొందరు మాత్రమే. వీరు ఆధునిక భౌతికశాస్త్రంలో పేరెన్నికగన్న వూల్ఫ్‌గాంగ్‌ పౌలీ, నీల్స్‌ బోర్, లార్డ్‌ రూథర్‌ఫర్డ్, పాల్‌ డైరాక్, ఎన్రికో ఫెర్మీ, ఎర్నెస్ట్‌ ష్రోడింగర్, జేమ్స్‌ చాద్విక్, జాన్‌  కాక్‌క్రాఫ్ట్, హిడెకీ యుకవాలతో కలిసి పని చేయడం లేదా వారితో సంబంధబాంధవ్యాలను కలిగి ఉండటం కద్దు. 

భాభాతో సంబంధం
కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ఖగోళ వికిరణాలపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే హోమీ భాభాకు ఒపెన్‌ హైమర్‌ (కేంబ్రిడ్జ్‌లో సీనియర్‌. తరువాతి కాలంలో బెర్క్‌లీలో పనిచేశారు) గురించి ఒక అవగాహన ఉండింది. 1936లో భాభా, వాల్టర్‌ హైట్లర్‌ ఉమ్మడిగా ఖగోళ వికిరణ జల్లు (కాస్మిక్‌ రే షవర్స్‌) సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా, ఒపెన్‌ హైమర్‌ ఓ ఏడాది తరువాత దాదాపుగా అలాంటిదే స్వతంత్రంగా ప్రతిపాదించారు. అప్పట్లో భాభాకు పాశ్చాత్యదేశాల్లోని గొప్ప భౌతిక శాస్త్రవేత్తలతో సంబంధాలు ఉండేవి.

ఒకానొక దశలో 1940లో తనను ఒపెన్‌ హైమర్‌కు పరిచయం చేయాల్సిందిగా భాభా తన మిత్రుడు పౌలీని కోరారు. ఇద్దరూ కలిసి బెర్క్‌లీలో పరిశోధనలు చేయాలన్నది ఉద్దేశం. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో భాభా భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. భౌతికశాస్త్ర మౌలికాంశాలపై పరిశోధనలు చేసేందుకు ఓ సంస్థను స్థాపించే అవకాశమూ అప్పుడే లభించింది. తరువాతి కాలంలో భాభాకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో కలిసి భారతీయ అణుశక్తి కార్యక్రమాన్ని సిద్ధం చేసి అమలు చేసే అవకాశమూ దక్కింది. 

అణు రియాక్టర్‌ నిర్మాణానికి, యురేనియం శుద్ధికి అవసరమైన ఇంజినీరింగ్‌ నైపుణ్యాన్ని భాభా తనకు పాశ్చాత్య దేశాల్లో ఉన్నసంబంధాల ద్వారానే సంపాదించగలిగారు. ప్రిన్స్‌టన్‌ , కావెండిష్‌ వంటి ప్రసిద్ధ సంస్థల తరహాలో టాటా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) స్థాపనకూ బాబా అంతర్జాతీయ సహ కారం అందేలా రూఢి చేసుకున్నారు. అయితే 1945లో హిరోషిమా, నాగసాకి లపై అణుబాంబులు పడిన తరువాత రాబర్ట్‌ ఒపెన్‌ హైమర్‌ వివాదాస్పద వ్యక్తి అయ్యారు.

అయినా టీఐఎఫ్‌ఆర్‌లో పరిశోధకుల బృందాన్ని తయారు చేసే విషయంలో భాభా ఆయన సాయం తీసుకున్నారు. ఒపెన్‌ హైమర్‌ విద్యార్థి, ఆయనతో కలిసి మన్‌హాటన్‌ ప్రాజెక్టులో పనిచేసిన బెర్నార్డ్‌ పీటర్స్‌కు ఉద్యోగమిచ్చారు. అప్పట్లో ప్రిన్స్‌టన్‌లో పనిచేస్తున్న ఒపెన్‌ హైమర్‌ సోదరుడు ఫ్రాంక్‌ ఒపెన్‌ హైమర్‌కూ ఉద్యోగం ఆఫర్‌ చేశారు భాభా. రాబర్ట్‌ను సంప్రదించిన తరువాతే ఫ్రాంక్‌కు ఉద్యోగం ఇవ్వజూపినట్లు చరిత్రకారులు చెబు తారు. ఈ అణుశక్తి కార్యక్రమ ఏర్పాటుకు ఫ్రెంచ్‌ నోబెల్‌ గ్రహీత ఫ్రెడెరిక్‌ జోలియోట్‌ క్యూరీ సలహాలు కూడా నెహ్రూ స్వీకరించారు.

పరోక్ష ప్రేరణ
ఒపెన్‌ హైమర్‌పై విమర్శలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో భాభా చేసిన కొన్ని నియామకాలపై నిరసన వ్యక్తమైంది. ఒపెన్‌ హైమర్‌కు కమ్యూనిస్టులతో ఉన్న గత సంబంధాలపై కూడా వివాదాలు తలె త్తాయి. ఒపెన్‌ హైమర్‌ కూడా తన మాజీ విద్యార్థి పీటర్స్‌ను కమ్యూ నిస్టు సానుభూతిపరుడిగా అభివర్ణించారు. దీంతో పీటర్స్‌ భారత్‌కు రావడం కష్టమైంది. ఎలాగోలా వచ్చిన తరువాత టీఐఎఫ్‌ ఆర్‌లో అతడిపై ఇంకోసారి దుమారం రేకెత్తింది.

ఇంకోవైపు ఫ్రాంక్‌ ఒపెన్‌ హైమర్‌ కూడా అమెరికా ప్రభుత్వం పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరిం చడంతో భారత్‌కు రాలేకపోయారు. అయితే అమెరికాలో రాబర్ట్‌ ఒపెన్‌ హైమర్‌ మాత్రం ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్సుడ్‌ స్టడీస్‌ (ఐఏఎస్‌) డైరెక్టర్‌గా కొనసాగుతూ భారతీయ శాస్త్రవేత్తలు చాలామందికి మార్గదర్శకుడిగా వ్యవహరించారు.

యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌లో యువ భౌతిక శాస్త్రవేత్తగా ఉన్న అల్లాడి రామకృష్ణన్‌ కు ప్రిన్స్టన్‌ యూనివర్సిటీ ఏడాది స్కాలర్‌షిప్‌ మంజూరు చేయడం మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.అల్లాడి భారత్‌కు తిరిగి వచ్చాక ఐఏఎస్‌ లాంటి సంస్థను స్థాపించాలని ఆశించారు. ఈ ఆలోచనే తరువాతి కాలంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌గా 1962లో మద్రాస్‌లో ఆవిష్కృతమైంది. 

భారత్‌కు తరచూ...
ఆ కాలంలో స్వల్పకాలిక పర్యటనపై భారత్‌కు విచ్చేసే విదేశీ శాస్త్రవేత్తల్లో ఒపెన్‌ హైమర్‌ పేరు తరచూ వినిపించేది. పీసీ మహాల నోబిస్‌ ఆలోచనల రూపమైన ‘షార్ట్‌ విజిట్స్‌ ఆఫ్‌ సైంటిస్ట్‌ ఫ్రమ్‌ అబ్రాడ్‌’లో భాగంగా ఒపెన్‌ హైమర్‌తో పాటు నీల్స్‌ బోర్, నార్బెర్ట్‌ వీనర్, పీఎంఎస్‌ బ్లాకెట్, జోసెఫ్‌ నీధమ్, జేబీఎస్‌ హాల్డేన్‌ లాంటి మహామహులు భారత్‌కు వచ్చిపోయేవారు. వీరికి పంపే ఆహ్వాన పత్రికలపై నెహ్రూ స్వయంగా సంతకాలు చేసేవారు. ఇందులో చాలామంది నెహ్రూకు తెలుసు.  

1945 అనంతర ఒపెన్‌ హైమర్‌ నైతిక దృక్కోణాన్ని నెహ్రూ బహిరంగంగా ప్రశంసించారు. 1959లో భారత జాతీయ సైన్‌్స కాంగ్రెస్‌ సమావేశాల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, ఒపెన్‌ హైమర్‌ భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందారని ఉల్లేఖించారు. పరి శోధనలు, ఆవిష్కరణలకు కూడా సామాజిక విపరిణామాలు ఉంటా యన్న విషయాన్ని పెద్ద శాస్త్రవేత్తలు గుర్తించేందుకు ఇది ఉపయోగ పడాలన్నారు.

హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగంతో రెండో ప్రపంచ యుద్ధం నాటకీయంగా ముగిసింది. ఈ ఘటన అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల మధ్య అణ్వాయుధ పోటీకి దారితీసింది. అదే సమయంలో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. వలసవాద శకం ముగిసిన తరువాత అణుశక్తిని శాంతియుత, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకోవడమన్న అంశం భారత్‌ లాంటి దేశాలకు ప్రధాన పరిశోధన ఇతివృత్తమైంది.

ఈ నవతరం సైన్స్ ను అభివృద్ధి చేయడం భారత్‌కు ప్రథమ కర్తవ్యమైంది. అణుశక్తిని విద్యుదుత్పత్తికి ఉపయోగించుకుంటామని భారత్‌ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే 1964లో చైనా అణుబాంబును పరీక్షించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదేళ్ల తరువాత భారత్‌ కూడా పోఖ్రాన్‌–1తో అణ్వస్త్ర దేశాల జాబితాలో చేరిపోయింది. కానీ భగవద్గీతకు నెలవైన భారత్‌ అణు మార్గం పట్టడాన్ని ఒపెన్‌ హైమర్‌ మాత్రం చూడలేకపోయారు!

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు