చేబ్రోలు: బజరంగ్ ఫౌండేషన్ విబిన్న ప్రతిభావంతులకు భరోసా నివ్వటం కోసం దివ్యాంగ దర్శిని పేరిట సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బజరంగ్ ఫౌండేషన్ సీఈవో అంబటి మురళీకృష్ణ అన్నారు. చేబ్రోలు మండలం మంచాల, చెరువులోపాలెం, పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామాల్లోని దివ్యాంగులను శనివారం ఆయన పరామర్శించి వారికి చేయూతను ఇవ్వనున్నట్లు తెలిపారు. చెరువులోపాలెంకు చెందిన ముట్లూరు శ్యాంసన్ రోడ్డు ప్రమాదంలో కాలు కొంత బాగం కోల్పోయాడు. మంచాల గ్రామానికి చెందిన పండ్రంగి సురేష్ అనారోగ్య కారణాలతో కాలు కొంత బాగం తొలగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరిని అంబటి మరళీకృష్ణ పరామర్శించి వీరికి జైపూర్ పాదాలు అందించి వారు కాళ్లమీద వారు నిలబడే విధంగా తోడ్పాటును అందించనున్నట్లు తెలిపారు. వీరికి ఇంటి ప్రాంగణంలో వెస్ట్రన్ కమోట్ను కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన పఠాన్ కరీముల్లా పోలియో మహమ్మారి కారణంగా అంగవైకల్యం బారిన పడ్డాడు. కరీముల్లాకు ట్రై సైకిల్ను అందించనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో పరామర్శించిన ముగ్గురికి బజరంగ్ దివ్యాంగ దర్శిని సేవా కార్యక్రమం ద్వారా జైపూర్ పాదాలు, ట్రై సైకిల్ అందించనున్నట్లు అంబటి మురళీకృష్ణ తెలిపారు. దివ్యాంగులకు చేయూతనివ్వటానికి బజరంగ్ ఫౌండేషన్ సన్నద్ధంగా ఉందని, సాయం కోరిన వెంటనే వారి నివాసానికి వచ్చి వారి స్థితిగతులను బట్టి తక్షణమే సహాయ సహాకారాలను అందించనున్నట్లు తెలిపారు. స్థానికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.