యద్దనపూడి: చోరీలకు పాల్పడిన నిందితుడిని యద్దనపూడి పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. నవంబర్ 22వ తేదీన యద్దనపూడి గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీతో పాటు వేణుగోపాలస్వామి ఆలయ అర్చకుడు పరుచూరి వెంకటరామాచార్యులు ఇంట్లో దేవరకొండ శ్రీను చోరీకి పాల్పడ్డాడు. అతడు ఎనిమిది సవర్ల బంగారం, 500 గ్రాముల వెండి వస్తువులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎం కార్డు తీసుకువెళ్లి మరో రూ.85 వేలు నగదు డ్రా చేసినట్లు చెప్పారు. నిందితుడు శ్రీనుపై దొంగతనాలకి సంబంధించి పలు స్టేషన్ల్లో కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి యనమదల సెంటర్లో దేవరకొండ శ్రీను అదుపులోకి తీసుకొని పర్చూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడి నుంచి రికవరీకి సంబంధించి పోలీసులు ఎటువంటి వివరాలు తెలపకపోవడం గమనార్హం.