గుంటూరు రూరల్: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి తెలిపారు. శుక్రవారం లాంలోని విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన అగ్రిటెక్ బ్రోచర్ విడుదల కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈనెల 3 నుంచి 5 వరకూ వ్యవసాయ సాంకేతిక సదస్సును నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సులో 3న సాంకేతికతపై సదస్సు జరుగుతుందన్నారు. 4న ఆధునిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, 5న నేల దినోత్సవం సందర్భంగా రైతులకు క్విజ్ పోటీలు, బహుమతుల ప్రదానం జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. అధునాతన వ్యవసాయ విధానాలతో కూడిన 125 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. 50 వేల మంది సందర్శకులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1800, గరిష్ట ధర రూ.2400, మోడల్ ధర రూ.2100 వరకు పలికింది.