లక్ష్మీపురం: ఈ ఏడాది నవంబర్లో గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో మొదటిసారిగా టికెట్ చెకింగ్ సిబ్బంది రూ.1.35 కోట్లను జరిమానాలుగా విధించినట్లు డీఆర్ఎం రామకృష్ణ, డీసీఎం కమలాకర్బాబు, సీనియర్ డీసీఎం దినేష్కుమార్ తెలిపారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో శుక్రవారం టికెట్ చెకింగ్ సిబ్బంది వై.ఎన్.పద్మారావు, కె.ప్రవీణ్కుమార్, సంతోష్ ఝ, కె.హేమలత, కె.ఆర్.ఎం.రెడ్డి, డి.ఆశోక్లను వారు అభినందించారు. ఈ సందర్భంగా డీసీఎం కమలాకర్బాబు మాట్లాడుతూ నవంబర్లో జరిమానాల నిర్దేశిత లక్ష్యం రూ.83 లక్షలకు గానూ రూ.1.35 కోట్ల వరకు జరిమానాలు వసూలు చేసినట్లు చెప్పారు. డివిజన్ ఏర్పడినప్పటి నుంచి ఇంత భారీస్థాయిలో జరిమానాలు విధించడం తొలిసారని తెలిపారు. బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించిన ఆరుగురు సిబ్బందిని డివిజన్ పరిధిలోని సిబ్బంది అంతా ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు.