పెళ్లయి విడాకులు.. కలిసి బతకలేమని.. కడకు ఊపిరి తీసుకుని.. 

16 May, 2023 08:08 IST|Sakshi

హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఓ యువతి, యువకుడి ఆత్మహత్య విషాదాన్ని నింపింది. ఇద్దరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. సీఐ కిషన్‌ కుమార్‌ చెప్పిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలోని గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన ఆకుల శ్యామ్‌ (24), పోతుల జ్యోతి (22) సమీప బంధువులు. మూడేళ్ల క్రితం జ్యోతికి వివాహమైంది.

కొద్ది రోజులకే భర్త నుంచి ఆమె విడిపోయింది. ఈ క్రమంలో గత నెల జ్యోతి నగరానికి వచ్చి కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. జ్యోతికి శ్యామ్‌తో అప్పటికే స్నేహం, ప్రేమ నేపథ్యంలో అతను కూడా ఇటీవల నగరానికి వచ్చాడు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని 7వ ఫేజ్‌ ఎల్‌ఐజీ గృహంలో ఉంటున్నాడు. 

స్నేహితుడి ఇంటి తాళాలు తీసుకుని.. 
శ్యామ్‌ స్నేహితుడు వంశీకి ఈ నెల 20న వివాహ నిశి్చతార్థం ఉండటంతో 9న ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లాడు. శుక్రవారం వంశీ ఇంట్లో లేకపోవటంతో శ్యామ్‌ అతనికి ఫోన్‌ చేసి ఇంటి తాళాలు తీసుకున్నాడు. అనంతరం హాస్టల్‌లో ఉంటున్న జ్యోతిని ఇదే ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరి నడుమ గత ప్రేమానుబంధాలతో పాటు ఇరు కుటుంబ పెద్దల వ్యతిరేకత నేపథ్యంలో కలిసి బతకలేమనుకున్నారు. దీంతో  శ్యామ్‌ ఉరి వేసుకొని, జ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.   

ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో.. 
మాదాపూర్‌లో ఉంటున్న జ్యోతి సోదరుడు ఆమెకు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవటంతో హాస్టల్‌కు వచ్చి చూశాడు. హాస్టల్‌లో జ్యోతి లేకపోవటంతో కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని స్నేహితుడైన వంశీ ఇంటికి వెళ్లి చూడగా తలుపులు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఇంట్లోంచి దుర్వాసన రావటంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు గడియ పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా గదిలో శ్యామ్‌ ఉరివేసుకొని, జ్యోతి పురుగుల మందు తాగి విగతజీవులుగా కనిపించారు. ఇరువురి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు