సుస్థిర ప్రభుత్వం, బలమైన నాయకత్వంతోనే హైదరాబాద్ మహానగరానికి పెట్టుబడులు వస్తాయని, వాటితో అభివృద్ధి సాధ్యమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్, జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్లకు మద్దతుగా శుక్రవారం బంజారాహిల్స్లోని జహీరానగర్ చౌరస్తా, జూబ్లీహిల్స్ రహమత్నగర్, యూసుఫ్గూడ డివిజన్లలో నిర్వహించిన రోడ్షోల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన జనంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహమత్నగర్, యూసుఫ్గూడ రహదారులన్నీ గులాబీమయంగా మారాయి. కేటీఆర్ ప్రసంగానికి పులకించిన ప్రజలు ఈలలు, కేకలతో చప్పట్లు కొడుతూ తమ మద్దతును ప్రకటించారు.