Mexico Truck Accident: వలసదారుల ట్రక్కు బోల్తా.. 10 మంది మృతి!

2 Oct, 2023 08:06 IST|Sakshi

దక్షిణ మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్‌లో అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న ట్రక్కు హైవేపై బోల్తా పడింది. ఈ ‍ప్రమాదంలో 10 మంది వలసదారులు మరణించారు 25 మందికి పైగా వలసదారులు గాయాలపాలయ్యారు. 

మృతులంతా మహిళలేనని అధికారులు తెలిపారు. వారిలో ఒకరు 18 ఏళ్లలోపు వయస్సు గలవారున్నారన్నారు. గ్వాటెమాల సరిహద్దులో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వారం రోజుల వ్యవధిలో వలసదారులకు సంబంధించి ఇది రెండవ ప్రమాదం అని తెలుస్తోంది. ప్రమాద బాధితులంతా క్యూబన్లు అని ఒక అధికారి వార్తాసంస్థకు వెల్లడించారు. దక్షిణ రాష్ట్రమైన చియాపాస్‌లోని పిజ్జియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు 27 మంది క్యూబా వలసదారులను తీసుకువెళుతున్నారు. పిజిజియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు ప్రమాదానికి గురైంది.

 ట్రక్కు డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని అధికారులు తెలిపారు. లారీ బోల్తా పడిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ట్రక్కు తునాతునకలయ్యింది. 

వలసదారులు తరచూ రష్యా నుండి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటారు. కాగా వలసదారులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. గత గురువారం తెల్లవారుజామున చియాపాస్ రాష్ట్రంలోని మెజ్‌కలాపా మున్సిపాలిటీ పరిధిలో ఒక ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వలసదారులు మరణించారు. అమెరికా వెళ్లేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది వలసదారులు మెక్సికో నుంచి బస్సులు, ట్రక్కులు, గూడ్స్ రైళ్లలో సైతం ప్రయాణిస్తుంటారు. 2021లో జరిగిన ఇటువంటి ప్రమాదంలో 55 మంది వలసదారులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: జపనీస్ కుర్రాళ్లు గడ్డం ఎందుకు పెంచుకోరు?

మరిన్ని వార్తలు