కేంబ్రిడ్జి విభాగానికి భారతీయ శాస్త్రవేత్త పేరు

2 Dec, 2020 07:53 IST|Sakshi

లండన్‌: కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌కి భారతీయ శాస్త్రవేత్త, ఔషధ దిగ్గజ కంపెనీ సిప్లా చైర్మన్‌ యూసుఫ్‌ హమీద్‌(84)పేరు పెట్టారు. ఈయన కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన క్రైస్ట్‌ కాలేజీలో చదివారు. యూసుఫ్‌ హమీద్‌ 66 ఏళ్లుగా యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నారు. కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌కి పెట్టిన ఈయన పేరు 2050 వరకు అమలులో ఉంటుందని యూనివర్సిటీ ప్రకటించింది. యూసుఫ్‌ 2018లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కెమిస్ట్రీ విభాగంలో ఉన్న పీఠానికి దాతగా ముందుకొచ్చారు. దీన్ని యూసుఫ్‌ హమీద్‌ 1702 పీఠంగా పిలుస్తుంటారు.

కాగా యూసుఫ్‌ హమీద్‌ తండ్రి కె.ఎ.హమీద్‌ ముంబైలో సిప్లా కంపెనీని ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అతి తక్కువ ఖర్చుతో హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ మందులను సరఫరా చేయడంలో ఈ కంపెనీ అగ్రభాగంలో నిలిచింది. కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌కి ఆయన చేసిన సాయం ఎంతో గొప్పదని, విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో ఉపయోగపడుతుందని వైస్‌ చాన్స్‌లర్‌ స్టీఫెన్‌ జె టూపే అన్నారు.  హమీద్‌ని 2005లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. (చదవండి: నీరా నియామకాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు)

>
మరిన్ని వార్తలు