Ram Mandir Inauguration: అమెరికాలోనూ.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు!

17 Dec, 2023 07:27 IST|Sakshi

యూపీలోని అయోధ్యలో త్వరలో నూతన రామాలయం ప్రారంభంకానుంది. దీనిపై భారతదేశంలోనే కాకుండా యావత్‌ ప్రపంచంలోని  హిందువులలో అమితమైన ఆసక్తి నెలకొంది. ఇదిలావుండగా అమెరికాలోని వాషింగ్టన్‌లో ఆదివారం రామాలయంలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. వాషింగ్టన్‌లోని హిందువులు.. అయోధ్య వే స్ట్రీట్‌లోని ఆంజనేయ ఆలయం వద్ద కారు, బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ వాహనాలపై కాషాయ జెండాలను ఎగురవేశారు. 

అమెరికాలో ఉంటున్న హిందువులు అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందువులంతా తమ ఇళ్లలో ఐదు దీపాలను వెలిగించాలని నిర్ణయించారు. అలాగే వివిధ నగరాల్లో కారు ర్యాలీలు నిర్వహించనున్నారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిగురించి విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా (వీహెచ్‌పీఏ) అధికారి అమితాబ్ మిట్టల్ మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని అమెరికాలోని వెయ్యికి పైగా ఆలయాలలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఈ వేడుకల్లో భాగస్వాములయ్యేందుకు అమెరికాలోని హిందువుల సౌకర్యార్థం వెబ్‌సైట్‌ను ప్రారంభించామని అమితాబ్ మిట్టల్‌ తెలిపారు. అమెరికాలో ఉంటున్న డాక్టర్‌ భరత్ బరాయ్ మాట్లాడుతూ మనందరి కల ఇన్నాళ్లకు సాకారం కాబోతున్నదని అన్నారు. రామ మందిరం కోసం లెక్కలేనంత మంది పోరాడారని, త్వరలో తాము అయోధ్యకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు.
ఇది కూడా చదవండి: నేడు ప్రధాని మోదీ వారణాసి రాక..

>
మరిన్ని వార్తలు