Coal Mines: బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి?

10 Dec, 2023 11:16 IST|Sakshi

చాలామంది కూలీలు ఉపాధి కోసం బొగ్గు గనుల్లో పనులు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను పక్కనపెట్టి ఈ పనుల్లో పాల్గొంటారు.  గ్లోబల్ ఎనర్జీ మానిటర్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం బొగ్గు గనుల మూసివేత కారణంగా 9,90,200 మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రపంచంలోని పలు బొగ్గు గనులు 2035కు ముందుగానే మూసివేయనున్నారు.

బొగ్గు గనుల మూసివేత ప్రభావం ముఖ్యంగా భారత్, చైనాలపై అధికంగా ఉండనుంది. దీని గరిష్ట ప్రభావం చైనాలోని షాంగ్సీలో కనిపించనుంది. 2050 నాటికి బొగ్గు తవ్వకాలకు సంబంధించి దాదాపు 2,41,900 ఉద్యోగాలు మాయం కానున్నాయి. మన దేశంలో మొత్తం 3,37,000 మంది కార్మికులు బొగ్గు తవ్వకాల పనుల్లో పాల్గొంటున్నారు. కార్మికుల తొలగింపుల విషయానికొస్తే కోల్ ఇండియా కంపెనీ పేరు ముందంజలో వస్తుంది. ఇది రాబోయే ఐదేళ్లలో 73,800 మంది కార్మికులను తొలగించనుందని సమాచారం. 

శిలాజ ఇంధనాల కాలుష్య స్థాయిలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను ఆపడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ముందడుగు వేస్తూ బొగ్గు వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని భారతదేశం గతంలో హామీ ఇచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోల్ ఇండియా పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారించే లక్ష్యంతో పని చేస్తోంది.

ఇదిలావుండగా 2022 నాటికి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సుమారు 9.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలుస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇందులో కేవలం 4.66 లక్షల మంది జలవిద్యుత్‌లో ఉపాధి పొందుతుండగా, సోలార్ పివిలో 2.82 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

బొగ్గు గనుల్లో పని చేసే కూలీలు ఉపాధి కోల్పోక ముందుగానే వారికి ఇతర ఉపాధి పనులను నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తద్వారా వారు జీవనోపాధి పొందగలుగుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: పెన్షన్‌ సొమ్ము కోసం భర్తకు నిప్పు!

>
మరిన్ని వార్తలు