మోదీకి యూఏఈ భారతీయ విద్యార్థి బహుమతి

24 Jan, 2021 10:22 IST|Sakshi

దుబాయ్‌: దుబాయ్‌లో నివాసముంటున్న భారతీయ విద్యార్థి శరణ్‌ శశికుమార్‌ (14) ప్రధాని మోదీ చిత్రాన్ని గీసి ఆయనకు గణతంత్ర దినోత్సవ బహుమానంగా ఇచ్చారు. దుబాయ్‌లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన విదేశాంగ శాఖ సహాయక మంత్రి వి మురళీధరన్‌ ద్వారా దాన్ని మోదీకి అందించనున్నారు. శరణ్‌ గీసిన స్టెన్సిల్‌ చిత్రంలో ప్రధాని మోదీ సెల్యూట్‌ చేస్తున్నట్లుగా ఉంది. దీనిపై మురళీధరన్‌ స్పందిస్తూ.. కేరళకు చెందిన దుబాయ్‌ విద్యార్థి, యువ చిత్రకారుడు గీసిన 6 పొరల స్టెన్సిల్‌ పెయింటింగ్‌ను అందుకున్నానని ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.

ఆ చిత్రాన్ని మోదీకి గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాలుడు ఇచ్చాడని తెలిపారు. ఆ పెయింటింగ్‌ 90 సెంటీమీటర్లు ఎత్తు, 60 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నట్లు గల్ఫ్‌ న్యూస్‌ వెల్లడించింది. దీన్ని గీయడానికి శరణ్‌కు ఆరు గంటలు పట్టినట్లు తెలిపింది. శరణ్‌ కోవిడ్‌–19 సమయంలో 92 మంది యూఏఈ అధికారుల చిత్రాలను గీశాడని చెప్పింది. శరణ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోగ్రాండ్‌ మాస్టర్‌ సర్టిఫికెట్‌ పొందాడు.

మరిన్ని వార్తలు