Mexico Gun Attack: ఇద్దరు చిన్నారులు సహా 8 మంది మృతి

30 Dec, 2021 13:35 IST|Sakshi

మెక్సికోసిటి: మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. గ్వానాజుటావో రాష్ట్రం సిలావో గ్రామంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్‌ మీద వచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులలో ఎనిమిది మంది అమాయకులు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు.. ఆగంతకులను పట్టుకోని వారిపై దాడిచేశారు. దీంతో వారు కూడా మరణించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు దుండగులతో సహా, మరో 8 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈ దాడులు నిర్వహించిన వారు డ్రగ్స్‌ ముఠాకు చెందిన వారిగా భావిస్తున్నారు. శాంటా రోసాడి లిమా, జాలిస్కో న్యూజనరేషన్‌ల మధ్య పోరాటం కారణంగా గ్వానాజువాటో అత్యంత హింసాత్మక ప్రదేశంగా మారింది.

2006లో మెక్సికో మాదక ద్రవ్యాల అక్రమరవాణాపై నియంత్రణ విధించినప్పటి నుంచి ఈ దాడులు అధికమయ్యాయి. కొన్ని డ్రగ్స్‌ గ్యాంగ్‌లు ఆధీపత్యం కోసం పరస్పరం దాడులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  గత నవంబరులో జరిగిన దాడిలో 11 మంది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే. 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది అమాయకులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

చదవండి: మరో రైల్వే స్టేషన్‌ పేరు మార్చేసిన యోగి ప్రభుత్వం.. ఇక నుంచి

మరిన్ని వార్తలు