ఫాక్స్కాన్ ఫౌండర్ రాకతో అధికార పార్టీ కి ముక్కోణపు పోటీ
చివరికి దానికే లాభిస్తుందని అంచనాలు
ఐ ఫోన్ తయారీ సంస్థ ఫౌండర్, అపర కుబేరుడు టెర్రీ గౌ కూడా తైవాన్ అధ్యక్ష రేసులో నిలిచారు. కుచేలుడి నుంచి కుబేరుని స్థాయికి ఎదిగిన ఆసక్తికర నేపథ్యం టెర్రీది. కనుక ఆయనకున్న ప్రజాదరణ నేపథ్యంలో ఒక్కడే గనక బరిలో ఉంటే పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమేనని అంటున్నారు. కానీ విపక్షాల తరఫున ఇప్పటికే ఇద్దరు రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో టెర్రీ పోటీ విపక్ష ఓటును మూడుగా చీల్చి చివరికి 2024 జనవరిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నెత్తిన పాలు పోసేలా కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ...
తైవాన్కు చెందిన 72 ఏళ్ల టెర్రీ
అపర కుబేరుడు. ఐ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ వ్యవస్థాపకుడు.వ్యాపారవేత్తగా దేశ ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అంతా ఇంతా కాదు. అధికార పక్షంతో ఇప్పటికే రెండు విపక్షాలు తలపడుతుండగా మూడో శక్తిగా ఆయన కూడా రంగంలోకి దిగి అధ్యక్ష ఎన్నికల రేసును ఆసక్తికర మలుపు తిప్పారు.
బరిలో ఆ ముగ్గురు...
అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు ఇది రెండో టర్మ్. అంతకు మించి పదవిలో కొనసాగేందుకు తైవాన్ నిబంధనలు అనుమతించవు. దాంతో ఈసారి అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తరఫున విలియం లై చింగ్ తే బరిలో దిగుతున్నారు.
ప్రధాన విపక్షమైన జాతీయవాద కోయిమిన్ టాంగ్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్గా చాన్స్ దక్కించుకునేందుకు టెర్రీ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులుగా హొవ్ యూ ఇయ్కు పార్టీ అవకాశం ఇచ్చింది.
మరో విపక్షం టీపీపీ తరఫున దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న కో వెన్ జే పోటీ పడుతున్నారు. రాజధాని తాయ్ పీ సిటీ మేయర్గా చేసిన అనుభవం ఆయన సొంతం. పైగా యువ ఓటర్లు ఆయనను వేలం వెర్రిగా అభిమానిస్తారు. ప్రస్తుతం రేసులో రెండో స్థానంతో వెన్ దూసుకుపోతున్నారు.
ఎంత ప్రయత్నించినా ప్రధాన విపక్షం డీపీపీ
నుంచి అవకాశం దక్కకపోవడంతో టెర్రీ స్వతంత్ర హోదాలో పోటీకి దిగారు. అంతులేని సంపద, వ్యాపార విజయాలతో పాటు చైనాతో దీర్ఘకాలం పాటు విజయవంతంగా కలిసి పని చేసిన విశేషానుభవం టెర్రీకి మరింతగా కలిసొచ్చే అంశం.– నేషనల్ డెస్క్, సాక్షి