వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తూ భారత ప్రజలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా కట్టడి విషయంలో ముందస్తు అంచనాలు తప్పుగా వేయడంతోనే భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు కారణమని అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారుడు, అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ తెలిపారు. కరోనా అంతమైందన్న తప్పుడు అభిప్రాయంతో భారత్లో ప్రభుత్వాలు అన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చాయి. దాని ఫలితమే ప్రస్తుత కరోనా వీర విహారానికి మూలమని ఆయన అన్నారు. మంగళవారం ఆయన సెనేట్ హెల్త్, ఎడ్యూకేషన్, లేబర్ పెన్షన్ కమిటీకి కొవిడ్పై విచారణ సందర్భంగా చెప్పారు.
తప్పుడు అంచనాలే కొంప ముంచాయి
క్లిష్ట పరిస్థితిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని భారత్లో సెకండ్ వేవ్ విలయం ద్వారా ప్రపంచానికి కూడా అర్థమవుతుందన్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ప్రజారోగ్యం పరంగా అవసరమైన సన్నద్ధతపై తెలుసుకోవచ్చునని, ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటూ వెళ్లాలని అవసరాన్ని సైతం నొక్కి చెబుతుందన్నారు. ప్రపంచ మహమ్మారులపై పోరాటంలో ఏ ఒక్క దేశం ఒంటరిగా పోరాటం చేయలేదని.. ప్రపంచ దేశాలన్ని ఏకమై బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఏ దేశంలో వైరస్ ఆనవాళ్లు మిగిలి ఉన్నా.. తిరిగి ప్రపంచం మొత్తం విస్తరించే ప్రమాదం ఉంది కనుక ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి విషయంలో అప్రమత్తత అవసరమని హెచ్చరించారు.
( చదవండి: కరోనా: ఐవర్మెక్టిన్పై కీలక సూచనలు చేసిన డబ్యూహెచ్వో )