జకర్తా: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఓడలో మంటలు చెలరేగి 14 మంది సజీవదహనమయ్యారు. సముద్రంలో చిక్కుకున్న మరో 226 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఈస్ట్ నుసా టెంగర్రా ప్రావిన్స్లో కుంపాంగ్ నుంచి కలాబాహి వెళ్తున్న ఓడలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది.
ఘటన సమయంలో ఓడలో 230 మంది ప్యాసెంజర్లు, 10 మంది సిబ్బంది కలిపి మొత్తం 240 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అకస్మాతుగా మంటలు ఎందుకు చెలరేగాయనే విషయం తెలియరాలేదు. దీనిపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
17 వేల ఐలాండ్స్కు నిలయమైన ఇండోనేసియాలో పడవ ప్రమాదాలు సర్వ సాధారణమయ్యాయి. ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించడం కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.
2018లో కూడా 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఓడ మునిగిన ఘటనలో 167 మంది జలసమాధి అయ్యారు. 19991లో జరిగిన మరో ఘటనలో సముద్రం మధ్యలో ఓడ మునిగి 332 మంది చనిపోయారు. 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇండోనేసియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విషాద ఘటన కావడం గమనార్హం.
చదవండి: బ్రిటన్ పీఎంగా రిషి.. మరి ఈ దేశాలను ఏలుతోంది మనోళ్లేనని తెలుసా?