ముంబయి 26/11 దాడులకు 15 ఏళ్లు.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

21 Nov, 2023 15:17 IST|Sakshi

ఢిల్లీ: ముంబయిలో 26/11 ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడులకు కారణమైన లష్కర్‌-ఈ తోయిబాను ఉగ్రసంస్థగా గుర్తించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రకమైన అభ్యర్థనను భారత్ కోరనప్పటికీ తాము స్వతహాగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 

ముంబయిలో నవంబర్ 11, 2008న ఉగ్రవాదులు వరుసదాడులకు పాల్పడ్డారు. పదిమంది ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా ముంబయిలోకి చొరబడ్డారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌, తాజ్‌ హోటల్‌, నారిమన్‌ లైట్‌ హౌస్‌ సహా ఇలా 12 చోట్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో కలిపి మొత్తం 175 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు మరో 14 దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. ఇందులో నలుగురు ఇజ్రాయెల్‌ దేశస్థులున్నారు.

ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అక్టోబర్ 7న హమాస్ బృందం ఇజ్రాయెల్‌లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ వైపు 1200 మంది మరణించారు. పాలస్తీనా వైపు 12,700 మంది ప్రాణాలు కోల్పోయారు.  

ఇదీ చదవండి: టీకాతో యువతలో అకాల మరణాలు ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు

మరిన్ని వార్తలు