జైలుశిక్ష తగ్గించేందుకు రూ.6 కోట్ల ఒప్పందం చేసుకున్న పాప్‌సింగర్‌

21 Nov, 2023 11:22 IST|Sakshi

పాప్ స్టార్ షకీరా పన్ను ఎగవేతపై నమోదైన కేసు విచారణలో భాగంగా స్పెయిన్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దానివల్ల తన జైలు శిక్ష తగ్గించుకున్నట్లు తెలిసింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. 2012-2014 మధ్య కాలంలో స్పెయిన్‌ ప్రభుత్వానికి రూ.131 కోట్లు పన్ను చెల్లించలేదని షకీరాపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన తర్వాత షకీరాకు 8 ఏళ్ల 2 నెలలు జైలు శిక్షతోపాటు రూ.216 కోట్లు జరిమానా విధించారు. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. 

సోమవారం జరిగిన కోర్టు విచారణలో భాగంగా అధికారులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. స్పానిష్ ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలో విఫలం అయినట్లు ఆమె ఒప్పుకున్నారు. మూడేళ్లు జైలు శిక్ష, రూ.6.3 కోట్లు జరిమానా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. షకీరా కఠిన నిర్ణయం తీసుకున్నారని, తన కెరియర్‌, పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఈ ఒప్పందం చేసుకున్నారని ఆమె తరఫు వాదించిన న్యాయవాద సంస్థ మిరియం కంపెనీ తెలిపింది. ఆమె తరఫు వాదించేలా అన్ని అంశాలను సిద్ధం చేశామని, కానీ తను అమాయకత్వం వల్ల అధికారులతో ఈ ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. 

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన ఇండిగో ఎయిర్‌లైన్స్

2012-2014 వరకు తను బహమాస్‌లో నివాసం ఉన్నట్లు, పన్ను ప్రయోజనాల కోసం తనను స్పానిష్ నివాసిగా పరిగణించకూడదని షకీరా అభ్యర్థించినట్లు తెలిసింది. కానీ స్పానిష్‌ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. షకీరా 2012లో 242 రోజులు, 2013లో 212 రోజులు, 2014లో 243 రోజులు స్పెయిన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్పెయిన్‌ చట్టంలోని నియమాల ప్రకారం 183 రోజుల కంటే ఎక్కువ కాలం దేశంలో గడిపిన వ్యక్తులు తమ ఆదాయాలను ప్రకటించి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షకీరా చాలాకాలం స్పెయిన్‌లో నివసించిందని, తన ఆదాయాలను దాచిపెట్టడానికి ప్రయత్నించినట్లు అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు