‘నా కారునే తీసుకెళ్తారా?!’

3 Oct, 2020 13:50 IST|Sakshi

వెరైటీ నిరసన..  5 గంటల పాటు నడిరోడ్డు మీద కూర్చొని

లండన్‌: సాధారణంగా మన దగ్గర నో పార్కింగ్‌ ఏరియాలో వాహనాలను ఆపితే ఏం చేస్తారు. ట్రాఫిక్‌ అధికారులు ఓ క్రేన్‌ తీసుకువచ్చి.. వాహనాలను తీసుకుని వెళ్లి పోతారు. ఆ తర్వాత మనం ఫైన్‌ కట్టి వాటిని విడిపించుకుంటాం. సాధారణంగా జరిగేది ఇదే. కానీ లండన్‌కు చెందిన ఓ నడి వయసు జంట మాత్రం ఇలా చేయలేదు. కారు తీసుకెళ్లడానికి వీలు లేకుండా రోడ్డుకు చెరో వైపు బైఠాయించి అధికారులను అడ్డుకున్నారు. ఇక చేసేదేం లేక వారి కారును వారికి తిరిగి అప్పగించారు అధికారులు. వివరాలు.. నార్త్‌ లండన్‌కు చెందిన పీటర్‌ ఫెన్నెల్‌ కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్‌ రూల్స్‌ని అతిక్రమించాడు. డబుల్‌ యెల్లో లైన్స్‌ మీద తన కారును పార్క్‌ చేశాడు. దాంతో అధికారులు అతడికి 300 పౌండ్ల జరిమానా విధించారు. (చదవండి: ఒకే బైక్‌.. 71 కేసులు !)

కానీ అతడు ఫైన్‌ కట్టడకపోవడంతో అధికారులు ఇంటికి వచ్చి కారును తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు అధికారులు. దాంతో ఆగ్రహించిన ఫెన్నెల్‌ దంపతులు చెరో వైపున నడి రోడ్డు మీద కూర్చున్నారు. ఫెన్నెల్‌ రోడ్డు మధ్యలో ఓ స్టూల్‌ వేసుకుని దాని మీద కూర్చుని ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకుని ఆఫీస్‌ పని చేసుకున్నాడు. మరో వైపు అతడి భార్య కూడా ఇలానే చేసింది. ఇలా దాదాపు ఐదు గంటలపాటు ఈ డ్రామా కొనసాగింది. చివరకు చేసేదేం లేక అధికారులు అతడి కారును తిరిగి అప్పగించారు. అనంతరం వారితో కలిసి శాండ్‌విచ్‌ తిని కాఫీ తాగి వెళ్లి పోయారు అధికారులు. ఈ సంఘటన కాస్త వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు ఫెన్నెల్‌ మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మరిన్ని వార్తలు