ఆ దెబ్బలకు ట్రంప్‌ విగ్రహం తీసేశారు!

20 Mar, 2021 15:31 IST|Sakshi
మ్యూజియం నుంచి తొలగించిన ట్రంప్‌ మైనపు విగ్రహం(మధ్యలో)

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌ హోస్‌ను వీడి నెలలు గడుస్తున్నాయి. అయినా! ఆయనపై వ్యతిరేకులకు కోపం తగ్గడం లేదు. అందుకే వీలు దొరికనప్పుడల్లా ట్రంప్‌పై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ సంతోషపడిపోతున్నారు. మరి కొంతమందైతే ఓ అడుగు ముందుకేసి టెక్సాస్‌లోని లూయిస్‌ టుస్సాడ్స్‌ వాక్స్‌ వర్క్స్‌లో ఉన్న ట్రంప్‌ మైనపు విగ్రహాన్ని పంచింగ్‌ బ్యాగ్‌ బ్యాగ్‌లాగా భావిస్తున్నారు. దానిపై పిడిగుద్దులు కురిపించి, కొంతమంది ముఖంపై గాట్లు పెట్టి సంతోషిస్తున్నారు. విగ్రహం ముఖంపై ఆ గాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో విగ్రహాన్ని తీసేశారు నిర్వహకులు.

దీనిపై మ్యూజియం రీజినల్‌ మేనేజర్‌ క్లే స్టీవర్ట్‌ మాట్లాడుతూ.. ‘‘ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల విగ్రహాలకు దాడుల బెడద తప్పదు. అందుకే ట్రంప్‌ విగ్రహాన్ని తొలగించాము. బహుశా భవిష్యత్తులో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టకపోవచ్చు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ విగ్రహం మ్యూజియానికి చేరుకోగానే దాన్ని పర్యటకుల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచుతాము. బైడెన్‌ విగ్రహంపై పర్యటకులు దాడి చేయరని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, 2019లో ట్రంప్‌ విగ్రహంతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల విగ్రహాలను కూడా పెట్టారు.

చదవండి : మానవ బాంబు ఆడియోలు అమ్మేస్తున్నాడు..

మరిన్ని వార్తలు