నార్త్‌ కొరియా మిస్సైల్స్‌ కవ్వింపు.. భద్రతా మండలిలో అమెరికా సంచలన ఆరోపణలు

6 Oct, 2022 08:59 IST|Sakshi

న్యూయార్క్‌: అణు ఆయుధాలు.. వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం జపాన్‌ వైపుగా మధ్యంతర శ్రేణి క్షిపణిని పరీక్షించి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజులు తిరగకముందే.. మరో పరీక్షను చేపట్టింది. 

గురువారం తూర్పు జలాల వైపుగా మరో బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది ఉత్తర కొరియా. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీ అధికారిక వార్తా సంస్థ యోన్‌హప్‌ ధృవీకరించింది. ప్యోంగ్‌యాంగ్‌ కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం ఆరు-ఆరున్నర గంటల మధ్యలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. ఇక ఉత్తర కొరియా ఇలా గ్యాప్‌ లేకుండా క్షిపణి పరీక్షలతో చెలరేగిపోవడంపై అగ్రరాజ్యం ఆగ్రహం వెల్లగక్కింది.

చైనా, రష్యాల అండ చూసుకునే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రెచ్చిపోతున్నాడంటూ  ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఐక్యరాజ్య సమితిలో అమెరికా శాశ్వత రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌, భద్రతా మండలిలో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. చైనా, రష్యాల పేర్లను ప్రస్తావించకుండానే.. పరోక్షంగా ఆమె ఈ ఆరోపణలు గుప్పించారు.

‘‘ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్యత్వం ఉన్న రెండు దేశాలు.. ఉత్తర కొరియాకు రక్షక కవచంలా పని చేస్తున్నాయి. అణు ఆయుధాలు, క్షిపణి పరీక్షలను ఖండిస్తూ ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తూ కట్టడి ద్వారా ఐరాస ప్రయత్నిస్తుంటే.. ఆ రెండు దేశాలు మాత్రం ఉత్తర కొరియాను ఆంక్షల నుంచి రక్షించే యత్నం చేస్తున్నాయి. ఆ రెండు దేశాల సంరక్షణలోనే ఉత్తర కొరియా ఉంది. వాళ్లను చూసే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రెచ్చిపోతున్నాడు అంటూ ఆమె పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. దాదాపు ఐదేళ్ల తర్వాత జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం చేపట్టి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది ఉత్తర కొరియా. ఈ నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా అక్కడి స్థానికులు ఖాళీ చేయించారు జపాన్‌ అధికారులు. అవసరమైతే త్రైపాక్షిక సంబంధాల ద్వారా అమెరికా-జపాన్‌-దక్షిణ కొరియాలు.. ఈ కవ్వింపు చర్యలను తిప్పి కొడతాయని వైట్‌ హౌజ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిగా అమెరికా, దక్షిణ కొరియాలు నాలుగు మిస్సైల్స్‌ను తూర్పు తీర ప్రాంతం వైపు బుధవారం ఉదయం ప్రయోగించాయి.  

గత వారం.. అమెరికా-దక్షిణ కొరియాలు సంయుక్తంగా చేపట్టిన నావల్‌ డ్రిల్స్‌కు ప్రతిగా ఉత్తర కొరియా వరుసగా మిస్సైల్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఏకంగా రికార్డు స్థాయిలో క్షిపణి ప్రయోగాలను చేపడుతున్నాడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.

ఇదీ చదవండి: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారతీయులు!?

మరిన్ని వార్తలు