ఎంత అదృష్టవంతులో.. రూ.55 కోట్లు కలిసొచ్చింది

5 Dec, 2020 15:39 IST|Sakshi

బెర్లిన్‌: లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారి గురించి విన్నాం.. విలువైన వజ్రాలు, సంపద దొరికి ధనవంతులు అయిన వారిని చూశాం. కానీ వారసులు లేకుండా మరణించడంతో ఆ సంపద మొత్తం ఇరుగుపొరుగు వారికి కలిసివచ్చి కోటీశ్వరులు అయిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా లేదు కదా. కానీ ఈ సంఘటన వాస్తవంగా చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మధ్య జర్మనీకి చెందిన రెడెట్ వెడెల్ తన భర్త ఆల్ఫ్రెడ్ వెడెల్‌తో కలిసి 1975 నుంచి హెస్సీ ప్రాంతంలో నివసిస్తుంది. ఈ క్రమంలో 2014లో ఆల్ఫ్రేడ్‌ మరణించాడు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో రెడెట్‌ కూడా మరణించింది. ఈ దంపతుల పేరు మీద భారీగా బ్యాంక్‌ బాలెన్స్‌, విలువైన షేర్లు, వస్తువులు ఉన్నాయి. అయితే వీటన్నింటికి వారసురాలిగా రెడెట్‌ తన చెల్లిని నియమించింది. కానీ దురదృష్టం కొద్ది ఆమె కూడా మరణించింది. (చదవండి: ఉద్యోగులకు బంపర్‌ బోనస్‌.. అయితే..)

దాంతో రెడెట్‌ ఆస్తికి వారసులు ఎవరూ లేకుండా పోయారు. ఇదే కాక వైపర్‌ఫెల్డెన్‌లో రెడెట్‌కి చెందిన ఓ ఇంటిని స్థానిక మున్సిపాలిటీ వారసత్వంగా పొందింది. కానీ ఆ బిల్డింగ్‌, దాని చుట్టు పరిసరాలను నిర్వహించడం కష్టంగా మారడంతో మున్సిపాలిటీ తన వారసత్వాన్ని వదిలేసుకుంది. ఈ క్రమంలో మొత్తం 7.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సంపదకు(55,34,89,125 రూపాయలు) వారసులు ఎవరు లేకుండా పోయారు. దాంతో స్థానిక మున్సిపాలిటీ ఆ సంపదను ఇరుగుపొరుగు వారికి వారసత్వంగా ఇచ్చింది. ప్రస్తుతం దీన్ని వారు "కమ్యూనిటీ సౌకర్యాలు, మౌలిక సదుపాయాల" అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. 
 

>
మరిన్ని వార్తలు