మాట కలిపి.. కారం చల్లి.. కత్తితో దాడిచేసి.. ఆపై దారుణం!

13 Oct, 2023 11:04 IST|Sakshi
రాజయ్య (ఫైల్‌)

పశువుల వ్యాపారి నుంచి రూ.82వేల చోరీ..

కేసు నమోదుచేసిన పోలీసులు!

కరీంనగర్: అతనో పశువుల వ్యాపారి. గురువారం అంగడి ఉండడంతో పశువులు కొనేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. దారిమధ్యలో ఆకలివేయడంతో టిఫిన్‌ కోసం ఆగాడు. టిఫిన్‌ తిని బిల్లు చెల్లిస్తుండగా.. అతనివద్ద డబ్బులు చూసిన ఓ మాయగాడు ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. తనవద్ద ఓ గేదె ఉందని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక పశువుల వ్యాపారి కళ్లలో కారంకొట్టి.. కత్తితో బెదిరించి.. రూ.82వేలు తీసుకుని పారిపోయాడు.

ఈ ఘటన మానకొండూర్‌ మండలం శంశాబాద్‌ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడు అంకతి రాజయ్య, ఎస్సై శ్రీకాంత్‌ వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన అంకతి రాజయ్య(63) పశువుల వ్యాపారం చేస్తుంటాడు. గురువారం పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి అంగడికి ద్విచక్ర వాహనంపై ఉదయాన్నే బయల్దేరాడు. మార్గంమధ్యలో ఆకలివేయడంతో తాడికల్‌ గ్రామశివారులో ఓ హోటల్‌ వద్ద ఆగాడు.

టిఫిన్‌ తిన్నాడు. తనజేబులో నుంచి డబ్బులు తీసి బిల్లు చెల్లిస్తుండగా.. అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి గమనించాడు. రాజయ్య వద్ద పెద్దమొత్తంలో నగదు ఉందని గమనించి, ఎలాగైనా కాజేయాలని పథకం పన్నాడు. రాజయ్య వద్దకు వచ్చి మాటామాట కలిపాడు. తనవద్ద ఓ గేదె ఉందని, అమ్ముతానని చెప్పడంతో రాజయ అతనితో కలిసి వెళ్లాడు.

మానకొండూర్‌ మండలం శంశాబాద్‌ శివారులోని కాలువ ప్రాంతానికి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తి రాజయ్య దగ్గర ఉన్న డబ్బు ఇవ్వమని బెదిరించాడు. ఇవ్వకపోవడంతో కళ్లలో కారం చల్లాడు. కత్తితో చేతిపై దాడి చేశాడు. అతని దగ్గర ఉన్న రూ.82వేలు తీసుకుని పారిపోయాడు. కాసేపటికి తేరుకున్న రాజయ్య వెంటనే మానకొండూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు