వెళ్లిన నెల రోజులకే.. ఇంటికి తిరిగొచ్చిన శ‌వపేటిక‌!

14 Dec, 2023 00:46 IST|Sakshi
బాబు (ఫైల్‌)

బహ్రెయిన్‌లో ప్రమాదం..

బావుసాయిపేట వాసి మృతి!

వేములవాడ: బతుకుదెరువు కోసం నెల క్రితం గల్ఫ్‌ వెళ్లిన ఓ యువకుడు అక్కడ జరిగిన ప్రమాదానికి బలికాగా.. వారం రోజులకు శవపేటిక ఇంటికి చేరింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన లింగంపెల్లి రాజనర్సయ్య–లచ్చవ్వ కుమారుడు లింగంపల్లి బాబు(28) నెల రోజుల క్రితం బహ్రెయిన్‌ దేశం వెళ్లాడు. ఈ నెల 7న అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తుండగా సెంట్రింగ్‌ పనికి వినియోగించే పెద్ద రాడ్‌ నాలుగో అంతస్తు మీదనుంచి బాబుపై పడింది.

ఈ ప్రమాదంలో బాబు అక్కడికక్కడే మృతిచెందినట్లు తోటి స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి రాజనర్సయ్య కొన్నేళ్ల క్రితమే చనిపోగా, తల్లి లచ్చవ్వ, భార్య శిరీష, నాలుగేళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్‌ గోలి మోహన్‌ అక్కడి ఇండియన్‌ ఎంబసీ వారితో మాట్లాడి మృతదేహం ఇంటికి చేరేందుకు కృషి చేశారు. బాబు శవపేటిక ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవి కూడా చ‌ద‌వండి: 'అమ్మవారి మాల' తీసి మరీ.. భార్యను కిరాత‌కంగా..

>
మరిన్ని వార్తలు