మళ్లీ గెలిపిస్తే ఎములాడను అభివృద్ధి చేస్తా.. : బండి సంజయ్‌

13 Feb, 2024 00:48 IST|Sakshi
ప్రజాహిత యాత్రలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, నాయకులు

రాజన్న ఆలయానికి నిధులు తెస్తా

ఎంపీ బండి సంజయ్‌

రెండో రోజు ప్రజాహిత యాత్ర

కరీంనగర్: మళ్లీ ఎంపీగా గెలిపిస్తే వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కరీంనగర్‌ ఎంపీ, బీజేపీజాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. వేములవాడరూరల్‌ మండలం చెక్కపల్లి, నూకలమర్రి, నమిలిగుండుపల్లి, వట్టెంల, శాత్రాజుపల్లి గ్రామాలలో సోమవారం ప్రజాహితయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

అయోధ్య అక్షింతలను కూడా రేషన్‌ బియ్యమంటూ హేళన చేస్తూ కాంగ్రెస్‌ నేతలు ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. వేములవాడకు రూ.500 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ మోసం చేసిండని, మూలవాగుపై బ్రిడ్జి రెండుసార్లు కూలిందన్నారు. బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం, బద్ది పోచమ్మ గుడి వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం రూ.575.95 కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని తెలిపారు.

రెండోసారి ఎంపీగా గెలిపిస్తే వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారం పోయినా కేసీఆర్‌ మంది కొంపలు ఎట్లా ముంచాలనేదానిపైనే కుట్రలు చేస్తున్నాడన్నారు. నిరుద్యోగులు, రైతుల కోసం పోరా డితే తనపై వంద కేసులు బనాయించి, రెండు సా ర్లు జైలుకు పంపారని గుర్తు చేశారు. బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు చెన్నమనేని వికాస్‌రావు, తిరుపతి, రవికిశోర్‌ పాల్గొన్నారు.

కరెంట్‌ సౌకర్యం కల్పించండి
శాత్రాజుపల్లిలో ఆయుష్మాన్‌ సెంటర్‌ను బండి సంజయ్‌ తనిఖీ చేశారు. సెంటర్‌లో కరెంట్‌ సౌకర్యం, ఫ్యాన్‌లు, టేబుళ్లు లేకపోవడంతో వెంటనే విద్యుత్‌ సిబ్బందికి ఫోన్‌ చేసి 24 గంటల్లో కరెంట్‌ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. టాయిలెట్లు కూడా లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలకు బెంచీలను తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఇవి చదవండి: 25 మంది ఎమ్మెల్యేలతో హరీష్‌ రావు కాంగ్రెస్‌లోకి వస్తే..: రాజగోపాల్‌ రెడ్డి

whatsapp channel

మరిన్ని వార్తలు