● గతంలో దరఖాస్తులు ఇచ్చినవారే మళ్లీ ఇస్తున్నారు.. ● సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితుల ఆవేదన ● ప్రజావాణికి 212 అర్జీలు
కరీంనగర్ అర్బన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 212 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో సుధాకర్ తెలిపారు. అయితే, వీటిలో చాలా దరఖాస్తులు ఇదివరకు ఇచ్చినవారే మళ్లీ ఇవ్వడం ఆందోళనకర పరిణామం. భూములను ఆక్రమిస్తున్నారని కొందరు, ప్రభుత్వ భూములను రక్షించాలని మరికొందరు, ధరణిలో తమ పేర్లు నమోదు కాకపోవడంతో రైతుబంధు ఇతర ప్రయోజనాలకు దూరమవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా భూ సమస్యలపై అర్జీలు ఎక్కువగా ఉండగా త్వరగా పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు కలెక్టర్ చొరవ చూపారు. వచ్చిన దరఖాస్తుల్లో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి 7, మున్సిపల్ ఆఫీస్కు 34, డీఈవో ఆఫీస్కు 6, వ్యవసాయ శాఖకు 3, ఆర్డీవో కార్యాలయానికి 18, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఆఫీస్కు 11, కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయానికి 10, ఇతర శాఖలకు 123 వచ్చినట్లు పేర్కొన్నారు.