యశవంతపుర: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమే. కానీ వారు తీసుకెళ్లే జంతువులకు, పక్షులకు కాదని స్పష్టమైంది. ఒక మహిళ చిలుకలను తీసుకెళ్తుండగా వాటికి కండక్టర్ టికెట్ ఇచ్చాడు. నాలుగు పక్షులకు మొత్తం రూ.444 చార్జి రాశారు. వివరాలు.. బుధవారం ఉదయం 8 గంటలకు సదరు మహిళ మనవరాలితో కలిసి పక్షులను తీసుకుని మెజెస్టిక్ బస్టాండులో మైసూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సెక్కారు.
కండక్టర్ ఆ చిలుకలను చూసి వాటికి టికెట్ తీసుకోవాలని మహిళను కోరడంతో ఆమె నిర్ఘాంతపోయింది. ఆమె వాదించినా ఒప్పుకోలేదు. ఒకవేళ చెకింగ్ అధికారులు వస్తే నాపైనే కేసు రాస్తారని కండక్టర్ చెప్పాడు. చివరకు ఆమె ఒక్కో చిలుకకు రూ.111 చొప్పున టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. టికెట్లలో చిలుకలను పిల్లలుగా రాశారు. ఈ తతంగం చూసి ప్రయాణికులు నవ్వుకున్నారు. కొందరు వీడియోలు, ఫోటోలు తీశారు.