చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు మంచి విద్యాబోధన చేసి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక కోరారు. జెడ్పీ కన్వెన్షన్ హాలులో మంగళవారం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ హారిక మాట్లా డుతూ.. పాలకవర్గం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రూ.21.99 కోట్లతో 516 పనుల మంజూరుకు ఈ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో జెడ్పీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మా ణానికి తొలి ప్రాధాన్యమిస్తూ వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు మంజూరుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులు ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలి
సర్వసభ్య సమావేశంలో తొలుత విద్యాశాఖపై జరిగిన చర్చలో పలువురు ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యా యుల కొరతపై చర్చించారు. కై కలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. శివారు గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులు లేరని వివరించారు. బందరు ఎమ్మెల్యే పేర్ని నాని స్పందిస్తూ.. ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలల్లో సీఎస్ఆర్ నిధుల ద్వారా విద్యా వలంటీర్లను నియమించాలని సూచించారు. మూడు జిల్లాల విద్యాశాఖ అధికారులు సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ.. మూడు జిల్లాల ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించి ఉపాధ్యాయుల కొరతను పరిష్కరిస్తామన్నారు. పెనుగంచిప్రోలు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ.. తనకు సమాచారం లేకుండా సర్పంచ్ ప్రమేయంతో విద్యాకమిటీ చైర్మన్ ఎంపిక జరిగిందని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పరిశీలించి పరిష్క రిస్తామని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారులు సమాధానం చెప్పారు. వెంటనే ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించి, విద్యాకమిటీ చైర్మన్ ఎంపికలో ఏ ఒక్క ప్రజాప్రతినిధికీ సంబంధం లేదని, తల్లిదండ్రులు మాత్రమే ఎన్నుకునే అవకాశం ఉందని ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని విద్యాశాఖాధికారులను ప్రశ్నించారు. అనంతరం జెడ్పీ వైస్చైర్మన్ గరికపాటి శ్రీదేవి మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించే సమయంలో అల్పాహారం అందించాలని కోరారు.
రైతులకు ఇబ్బందులు రాకుండా..
వ్యవసాయంపై చర్చలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుపై తీసుకున్న చర్యలను పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించారు. కోడూరు మండ లంలో రైతులు పండించిన ధాన్యాన్ని దూరప్రాంతాలకు చెందిన మిల్లులకు చేరవేసే సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, వాటిపై దృష్టిసారించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కోరారు. కృష్ణాజిల్లాలో చేపట్టిన ప్రణాళికను ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోనూ పాటించాలని అధికారులను ప్రజాప్రతినిధులు కోరారు. అనంతరం గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించి చర్చ జరిగింది.
శివారు గ్రామాల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయండి రైతులకు ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ ధాన్యం సేకరించాలి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ ఉప్పాల హారిక సమావేశానికి హాజరుకాని అధికారులపై పేర్ని నాని ఆగ్రహం రూ.21.99 కోట్ల పనుల మంజూరుకు సమావేశంలో తీర్మానం
గైర్హాజరైన అధికారులతో మరో సమావేశం
జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులతో త్వరలో మరోసారి సప్లిమెంటరీ సమావేశం ఏర్పాటు చేస్తామని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం చర్చ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు కాలేదని గుర్తించారు. వారు ఎందుకు రాలేదని ఎమ్మెల్యే పేర్ని నాని ఆరా తీశారు. ఏలూరు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృష్ణాజిల్లా ఎస్ఈగా అదనపు బాధ్యతలు స్వీకరించారని, ఈ రోజు ఏలూరులో ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు మీటింగ్ను కలెక్టర్ ఏర్పాటు చేశారని అందువల్ల సమావేశానికి హాజరు కాలేకపోయారని ఆర్డబ్ల్యూఎస్ డీఈ వివరించారు. పేర్ని నాని మాట్లాడుతూ.. జెడ్పీ సర్వసభ్య సమావేశం కంటే ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు మీటింగ్ ముఖ్యమా అని ప్రశ్నించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశ సమయంలో మరో మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులను రాకుండా చేయటం ఏమి టని ఏలూరు జిల్లా కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి రాని శాఖల అధికారులతో సప్లిమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పేర్ని నాని కోరారు. చైర్పర్సన్ స్పందిస్తూ.. వారం రోజుల్లో ఏలూరు జిల్లా కలెక్టర్తో పాటు గైర్హాజరైన అధికారులతో సప్లిమెంటరీ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు పి.రాజాబాబు, ఎస్.ఢిల్లీరావు, ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, నూజివీడు సబ్కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ట్రైనీ కలెక్టర్ టి.శ్రీపూజ, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.